మూడో జడ్జి: గాలి బెయిల్ కేసులో హైకోర్టు వేటు

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మరో జడ్జిపై వేటు పడింది. జడ్జి లక్ష్మీ నరసింహా రావుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం వేటు వేసింది. లక్ష్మీ నరసింహా రావు సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. గాలి బెయిల్ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఉదయం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అదుపులోకి తీసుకుంది. లక్ష్మీ నరసింహా రావును సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఎసిబి అధికారులు లక్ష్మీ నరసింహా రావు, మరో జడ్జి ప్రభాకర రావు ఇళ్లల్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎసిబి వెస్ట్ మారెడ్‌పల్లిలోని జడ్జి లక్ష్మీ నరసింహ రావు ఇంటి నుండి లాప్‌టాప్‌తో పాటు మరిన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదర్‌గూడలోని ప్రభాకర రావు ఇంట్లోనూ ఎసిబి సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. గాలి బెయిల్ డీల్ కేసులో లక్ష్మీ నరసింహా రావు పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వీరిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే గాలి కేసులో ఇద్దరు జడ్జిలు అరెస్టయ్యారు.

కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో యాదగిరి రావు కీలక పాత్రధారి అని అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వారం రోజుల క్రితం పేర్కొన్న విషయం తెలిసిందే. తాము యాదగిరి ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆయన ఇంటిలోని దేవుడి గదిలో రూ.3.75 కోట్లు స్వాధీనం చేసుకున్నామని రిపోర్టులో పేర్కొన్నారు. యాదగిరి సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని చెప్పారు.

ఆయన వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, ఓ కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబు, గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి నుండి యాదగిరి రూ.9.5 కోట్లు తీసుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మాజీ జడ్జిలు పట్టాభి రామారావు, చలపతి రావులతో యాదగిరి పలుమార్లు ఫోన్‌లలో మాట్లాడారని చెప్పారు.

ఐడిబిఐ బ్యాంకులో యాదగిరి రూ.36 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారని తెలిపారు. యాదగిరి నుండే మిగతా నిందితులకు డబ్బులు అందాయని తెలిపారు. సోమశేఖర రెడ్డి ఏడు వాయిదాలలో యాదగిరికి డబ్బులు పంపించాడని, ఆ డబ్బుతోనే అతను కారు, ఇల్లు, ఇంటిస్థలం కొన్నారని పేర్కొన్నారు. కాగా యాదగిరి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న డబ్బును ఎసిబి కోర్టులో జమ చేసింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో యాదగిరిని ఎసిబి రెండు రోజుల క్రితం కర్నూలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇదే కేసులో అరెస్టైన మాజీ జడ్జి పట్టాభి రామారావుకు కోర్టు రిమాండును పొడిగించింది. పట్టాబిని మరో రెండు వారాల జ్యూడిషియల్ కస్టడీకి పంపింది. దీంతో అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు జడ్జిలకు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పట్టాభి రామారావు, చలపతి రావు, పట్టాభి తనయుడు రవిచంద్ర, యాదగిరిలను ఎసిబి అరెస్టు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+