సాగర్ నీళ్లు వదలొద్దు: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
వెంకట్ రెడ్డి అనే చీఫ్ ఇంజనీర్ సాగర్ నీటి విడుదలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. నాగార్జున సాగర్లో 510 అడుగులకు తక్కువగా ఉంటే నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయవద్దని, నీటి మట్టం 525 అడుగులకు పైగా ఉంటే మాత్రమే విడుదల చేయవచ్చునని, ఇప్పుడు 510 మాత్రమే ఉందని కాబట్టి విడుదలను ఆపాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు ఈ రోజు దానిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరగనుంది. హైకోర్టు తీర్పుపై వెంకట్ రెడ్డి స్పందించారు. నాగార్జున సాగర్లో నీరు డెడ్ స్టోరేజ్లో ఉందని, ఇలాంటి పరిస్థితులలో నీటిని విడుదల చేస్తే ముందు ముందు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతాయన్నారు.
ఇప్పటికే శ్రీశైలం నుండి నీటిని విడుదల చేశారని, ఇప్పుడు సాగర్ నీరు కూడా విడుదల చేయడం సరికాదన్నారు. 525 ఫీట్లు ఉంటేనే ఎడమ, కుడి కాలువల గుండా నీటిని విడుదల చేయవచ్చునని చెప్పారు. జూన్ ఫస్ట్ నాటికి గతంలో 510 కంటే కిందకు పోయిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు. గతంలో 501, 502, 500 కంటే తక్కువగా వచ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు.