తెలంగాణపై కెసిఆర్ మాటలు ఉత్తవేనా, ఎందుకలా?
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ మాటలు చూస్తుంటే అటువంటి సంకేతాలేవీ లేవని అర్థమవుతోంది. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నాన్చుడు ధోరణిని మాత్రమే అవలంబిస్తోందని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప తెలంగాణ వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు. ఇందుకు అనుగుణంగానే సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాటలు కూడా ఉన్నాయి. కెసిఆర్ చెప్పినట్లు కాంగ్రెసు అధిష్టానంపై తెలంగాణ మీద ఏ విధమైన సంకేతాలు లేవని ఆయన అన్నారు.
ఇదే సమయంలో తమకు తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని, అయితే తెలంగాణ వచ్చే అవకాశాలు లేవని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఆయన మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాదనే విషయాన్ని సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా అన్నారు. సీమాంధ్ర నాయకులంతా ఆ ధీమాతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
తెలంగాణ వస్తున్నట్లు తనకు సంకేతాలు అందాయని కెసిఆర్ చెప్పడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. నిజానికి, కెసిఆర్ ఇటువంటి ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడుతుందని ఎవరూ ఇప్పుడు విశ్వసించడం లేదు. సమస్యను నాన్చడం ద్వారా ఎప్పటికప్పుడు తన పనులను కానిచ్చుకోవడమే ధ్యేయంగా ఆ పార్టీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ అంశం ఎజెండాగా మారకుండా చూసేందుకే కెసిఆర్కు ఏమైనా అటువంటి సంకేతాలు ఇచ్చిందా, కెసిఆర్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అలాంటి వ్యవహారాన్ని నడిపిందా తెలియదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస మధ్దతు పొందడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం అటువంటి ఎత్తుగడను అనుసరించి ఉండవచ్చు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసుకు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాటలేం చెప్పినా వైయస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి స్థితిలో కెసిఆర్ తెలంగాణ వస్తుందంటూ చేసిన ప్రకటనలు అంత నమ్మశక్యంగా కనిపించడం లేదని అంటున్నారు.