వైయస్ లేనప్పుడు కుట్రే లేదు: నిమ్మగడ్డ ప్రసాద్
మంగళవారం కూడా సిబిఐ కోర్టులో వాదనలు కొనసాగాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయ సాయిరెడ్డికి ఇదే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఏ12గా ఉన్న నిమ్మగడ్డ మాత్రం ఎందుకు అర్హుడు కాదని డిఫెన్స్ లాయర్ ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.
'భారతీ సిమెంట్స్లో మా క్లయింట్ పెట్టిన పెట్టుబడులు, ఆ సంస్థను ఫ్రాన్స్ కంపెనీకి అమ్మినప్పుడు తిరిగి వచ్చేశాయి. లంచంగా పెడితే ఆ డబ్బులు తిరిగి ఎందుకు ఇస్తారు? ఆ వ్యవహారంలో రూ.62 కోట్ల ఆదాయపన్ను కూడా చెల్లించారు. జీ2జీ విధానం కింద ఏర్పాటు చేయదలుచుకున్న వాన్పిక్ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు రస్-అల్-ఖైమాకు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. సీబీఐ ఎందుకంత ఉత్సుకత చూపుతోంద'ని ప్రశ్నించారు.
భూ కేటాయింపులన్నీ కేబినెట్ అనుమతితోనే జరిగాయని, తప్పులు జరగలేదని తెలిపారు. 'ఆధారాలన్నీ సీబీఐ వద్ద ఉన్నపుడు నిమ్మగడ్డ వాటిని ఎలా తారుమారు చేస్తారు. ఈ కేసులో సీబీఐ ఎన్ని చార్జిషీట్లు వేస్తుందో తెలియదు. కేసు విచారణ ఎప్పుడు మొదలవుతుందో, పూర్తవుతుందో తెలియదు. అప్పటి వరకు జైల్లో ఉంటే, అది విధించే శిక్ష కన్నా ఎక్కువ కావచ్చు. మాకేవలం సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న అనుమానంతోనే నిమ్మగడ్డను అరెస్టు చేసిందని, అందుకు ఆధారాలు చూపలేదదని అన్నారు. సీబీఐ వాదనలు ముగియకపోవడంతో కేసు గురువారానికి వాయిదా పడింది.