ఢీకొని గోదావరిలో పడిన రెండు లారీలు, 5గురు మృతి
వంతెన ప్రమాదకరంగా ఉన్నప్పుడు లారీ వేగంగా రావడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందంటున్నారు. ఢీకొన్న రెండు లారీలు వంతెన మీద నుండి గోదావరి నదిలో పడిపోయాయి. చనిపోయిన ఐదుగురిలో ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఘటన జరగగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే స్పందించారు. మృతులంతా విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు లారీలో 20 మంది కూలీలు ఉన్నారు. కాగా జొన్నాడ ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. గోదావరిలో పడిపోయిన లారీలను పోలీసు సిబ్బంది క్రేన్ సహాయంతో బయటకు తీసింది.
మరోవైపు హైదరాబాదులోని ఉందానగర్ రైల్వే స్టేషన్లో ఉదయం రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడమే మృతి చెందారు. వారు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది.