ఉరేసి ఇద్దరు చిన్నారుల హత్య, దొంగతనం కోసమే
సాయంత్రం 6.30 సమయంలో ఆమె ఇంటికి వచ్చింది. తలుపు తీసి ఉండడంతో అనుమానమొచ్చి లోపలికి వెళ్లింది. కూతుళ్లు నేల మీద పడి ఉండడం, వారి గొంతుపై ఉరి బిగించిన ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన చెందింది. వెంటనే సమీపంలో ఉన్న రెండు, మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పట్టించుకోకపోవడంతో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పిల్లలు మృతిచెందారని అక్కడి వైద్యులు ద్రువీకరించారు. తుకారాంగేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్రెడ్డి, మహంకాళి ఏసీపీ వాసుసేన సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూటీం ఆధారాలు సేకరించింది. చిన్నారుల మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు మార్చురీ వద్దకు వచ్చారు.
ఆర్ఆర్సీ మైదానానికి సమీపంలో యాకూబ్పాషా ఇల్లు ఉంటుంది. ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన వారు హత్యకు పాల్పడ్డారా, వారు ఆర్ఆర్సీ మైదానం వైపు నుంచి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోని 9 తులాల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని యాకుబ్పాషా తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీన్నిబట్టి దొంగతనం కోసమే పిల్లలను దుండగులు చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన శుభకార్యానికి ఇద్దరు పిల్లలకు సమ్రీనా నగలు పెట్టినట్టు తెలిసింది. చిన్నారుల్ని దొంగలే హత్య చేసి నగలు దోచుకెళ్లి ఉంటారని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.