చల్లారని పవార్: ప్రభుత్వంలో ఉండబోమని లేఖ
తమకు లోకసభలో ఏడుగురు సభ్యులు, రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారని, వారంతా యుపిఎలో భాగస్వాములుగానే ఉంటారని శరద్ పవార్ సోనియాకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్కు నచ్చజెప్పడానికి కాంగ్రెసు నాయకులు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. కాంగ్రెసు కోర్ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమైన పరిస్థితిని సమీక్షించింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లతో పాటు సీనియర్ మంత్రులు పాల్గొన్నారు.
తమది చిన్న పార్టీ అని, దానికి గౌరవం ఉంటుందని అనుకోవడం లేదని, భవిష్యత్తు కోసం తాము పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నామని పవార్ సోనియాకు రాసిన లేఖలో అన్నారు. కేవలం నెంబర్ టూ స్థానం ఇవ్వకపోవడమనేది మాత్రమే పవార్ అసంతృప్తికి కారణం కాదని తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీ స్థానంలో సుశీల్ కుమార్ షిండేను సభా నాయకుడిగా చేసే కాంగ్రెసు ఆలోచనపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పవార్ శుక్రవారం ఉదయం సోనియాను కలిసిన తర్వాత పరిస్థితి చక్కబడుతుందని అందరూ భావించారు. అయితే, శరద్ పవార్, ప్రఫుల్ పటేలే ముంబైకి వెళ్లిపోయారు. అక్కడ వారు తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమవుతారు.
మహారాష్ట్రలో తమ పార్టీ శాసనసభ్యులకు ఏ మాత్రం గౌరవం లేదని, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పని చేయడం లేదని, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, దాంతో తమ శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారని పవార్ సోనియాకు చెప్పినట్లు సమాచారం.విధానపరమైన చచ్చుతనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పీడిస్తోందని ప్రఫుల్ పటేల్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పవార్ ప్రధానికి రాజీనామా లేఖ రాశారా లేదా అనే విషయాన్ని ఆయన ధ్రువీరకరించలేదు.
నెంబరు టూ కోసం తాపత్రయపడే తక్కువ స్థాయి నాయకుడు పవార్ కారని అంటూ కొంత మంది కాంగ్రెసు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రఫుల్ మాటలను బట్టి కూడా ఎన్సీపి అసంతృప్తి చల్లారలేదనేది అర్థమవుతోంది.