పవార్ కోసం దిగొచ్చిన ప్రధాని, ప్రశంసల జల్లు
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో శరద్ పవార్ మాట్లాడిన తర్వాత మన్మోహన్ సింగ్ ఆ వ్యాఖ్యలు చేశారు. యుపిఎ, ప్రభుత్వ పనితీరు పట్ల తమకు కొన్ని సమస్యలున్నాయని ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్యలపై శరద్ పవార్ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఓ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
వచ్చే ఎన్నికలకు సిద్ధం కావడానికి ప్రభుత్వం మరింత నిర్ణయాత్మకంగా, సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని తమ పార్టీ భావిస్తోందని ఆయన అన్నారు. నెంబర్ 2 స్థానం కోసం తమ నేత శరద్ పవార్ అలిగారంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. శరద్ పవార్కు స్థానాల విషయం చాలా చిన్నదని ఆయన అన్నారు. మీడియాను కాంగ్రెసు నాయకులు కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
కుర్చీ కోసం పట్టుబట్టే తక్కువ స్థాయి నాయకుడు శరద్ పవార్ కారని ఆయన అన్నారు. శరద్ పవార్ సోనియాతో చర్చలు జరిపిన తర్వాత ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. యుపిఎలో కొనసాగుతామంటూనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిస్థితిపై చర్చించేందుకు ఎన్సీపి మరోసారి శుక్రవారం సాయంత్రం సమావేశమవుతోంది.