విజయమ్మ దిష్టిబొమ్మ దగ్ధం: వైయస్ విగ్రహం ధ్వంసం
విజయమ్మ దీక్షను అడ్డుకుంటారనే ఆరోపణలతో తెలంగాణవాదుల ముందస్టు అరెస్టులపై కెటిఆర్ మండిపడ్డారు. ముందస్తు అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. అరెస్టులపై మాజీ ఎంపి వినోద్ కుమార్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయమ్మ దీక్షను నిరసిస్తూ వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.
నల్గొండలో తెరాస మహిళా కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద విజయమ్మ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో రాస్తా రోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ముందస్తుగా అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని టిఆర్ఎస్వీ నేత బాల్క సుమన్ హైదరాబాదులో డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉద్యమం లేదని చూపే కుట్రలో భాగంగా విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టారని మండిపడ్డారు. గతంలో చేనేత కార్మికులను ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసుకు అధికార దాహం తప్ప చేనేత కార్మికులపై ప్రేమ లేదన్నారు. సోమవారం తెలంగాణలో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెసుదే బాధ్యత అని హెచ్చరించారు.
కాగా కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మరోవైపు విజయమ్మ దీక్ష నేపథ్యంలో పలువురి తెరాస నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లుగా సమాచారం.