తెలంగాణ: బొత్స, కెసిఆర్లపై లగడపాటి విసుర్లు
దేశం విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతోనే తాను సమైక్యవాదాన్ని వినిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తుంటే కలిసి ఉన్నప్పుడే అడ్డుకుంటుంటే రాష్టం విడిపోతే ఏమవుతుందో ఊహించలేరా అని ఆయన అడిగారు. సెప్టెంబర్లో తెలంగాణ వస్తుందని సంకేతాలు అందినట్లు కెసిఆర్ చెబుతున్న మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. దొంగ మాటలతో ప్రజలను కెసిఆర్ మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయని తెరాస ఐదేళ్ల పాటు తెలంగాణ రాదని అంగీకరించినట్లేనా, తెలంగాణపై ఆశలు వదులుకున్నట్లేనా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్నారని, పార్టీలకు అతీతంగా నాయకుల పర్యటనకు భద్రత కల్పిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు, వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు ఆటంకాలు లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా ఉంటారని, ఈ ఐదేళ్లు తెలంగాణ రాదని కెసిఆర్ అంగీకరించినట్లే కదా అని ఆయన అన్నారు.