తెలంగాణ ఇష్యూ: రేపు ఢిల్లీకి గవర్నర్, ముఖ్యమంత్రి
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈలోగానే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇందులో భాగంగానే నరసింహన్, కిరణ్ కుమార్ రెడ్డిలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
నరసింహన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తదితర కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే నష్టమేమిటని ఆయన తన ఢిల్లీ పర్యటనలో అన్నారు. బొత్స ప్రకటనపై సీమాంధ్ర నాయకులు మండిపడుతున్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి బొత్స సత్యనారాయణ అటువంటి ప్రకటన ఎలా చేస్తారని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు గాదె వెంకటరెడ్డి సోమవారం అన్నారు.
బొత్స సత్యనారాయణ ప్రకటన సరైంది కాదని, అది బొత్స సత్యనారాయణ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ తెలంగాణకు అనుకూలంగా పరోక్షంగా వ్యాఖ్య చేయడం పార్టీ అధిష్టానం సంకేతాలను అందించడమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం పార్టీ పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను తీసుకుంది.