విజయమ్మ భారీ కాన్వాయ్కు నో చెప్పిన పోలీసులు
రహదారి వెంట భారీగా పోలీసులను మోహరించారు. అయితే పోలీసులు కుకునూరుపల్లి వద్ద ఆమె కాన్వాయ్ని అడ్డుకున్నారు. విజయమ్మ వాహనం మినహా మిగతా వాహనాలకు అనుమతి లేదని పోలీసులు కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఆమె కారు వెనుక కొన్ని వాహనాలను మాత్రమే రక్షణ కోసం అనుమతించారు. మిగిలిన వాహనాలను అక్కడే నిలిపివేశారు. దీంతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.
కాగా మరికొద్దిసేపట్లో విజయమ్మ ధర్నా ప్రారంభం కానుంది. ఆమె పదకొండున్నర, పన్నెండు గంటల ప్రాంతంలో సిరిసిల్లకు చేరుకుంటారు. మరోవైపు అంతకుముందు తెలంగాణ ప్రజాఫ్రంట్ చైర్మన్ విమలక్క విజయమ్మ దీక్షా ప్రాంగణం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తెలంగాణలో విజయమ్మ అడుగు పెట్టరాదని వారు నినాదాలు చేశారు. ఓ సమయంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా విజయమ్మ ఇక్కడ అడుగు పెట్టరాదని విమలక్క డిమాండ్ చేశారు.
విజయమ్మ సిరిసిల్ల పర్యటనను నిరసిస్తూ మెదక్ జిల్లా దుద్దెడ వద్ద జాతీయ రహదారిపై టిఆర్ఎస్ కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. విజయమ్మ కాన్వాయ్ను అడ్డుకునేందుకు వారు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు తెరాస ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్లలో బంద్ కొనసాగుతోంది. పట్టణంలోని వ్యాపార సముదాయాలు, దుకుణాలు, విద్యా సంస్థలను మూసివేశారు. పోలీసులు తెరాస కార్యకర్తలను అరెస్టు చేస్తున్న నేపథ్యంలో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లారు.