విజయమ్మ దీక్షకు నిరసనగా కొనసాగుతున్న బంద్
జిల్లాలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఆర్టీసి బస్సులు రోడ్డెక్కలేదు. తెలంగాణలోని జిల్లాల్లో ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. తెలంగాణ జిల్లాల్లోని పలుచోట్ల వైయస్ విజయమ్మ, సిరిసిల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. నోటికి నల్లగుడ్డ కట్టుకొని విజయమ్మ దీక్షకు నిరసన తెలిపారు. సిరిసిల్లలో విజయమ్మ నివాళులు అర్పించిన అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేశారు.
వైయస్ విజయమ్మ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేసినట్లుగా లేదని, తెలంగాణపై దండయాత్రకు వచ్చినట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా అధ్యక్షురాలు తుల ఉమ హైదరాబాదులో తెరాస భవనంలో విమర్శించారు. హైదరాబాదు నుండి సిరిసిల్ల వరకు విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకొని ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారని, అయినా ఆమె స్పందించలేదన్నారు.
తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం చెప్పాలని అడిగిన వారిపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, లాఠీచార్జ్ చేస్తుంటే విజయమ్మ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అక్రమంగా డబ్బులు సంపాదించిన జగన్ పార్టీ భూస్థాపితం కాక తప్పదన్నారు. తెలంగాణ విద్యార్థులు, మహిళలపై దాడి చేయించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సీమాంధ్ర నేతలు అందరూ ఒకటై తెలంగాణవాదం లేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.