దమ్ముంటే అమలు చేయండి: చంద్రబాబు సవాల్
సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో అఖిల భారత యాదవ మహాసభ, ముదిరాజ్ సంఘాలు చంద్రబాబును బీసీ డిక్లరేషన్ విషయంలో ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్కు అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. "టిడిపి బీసీల పార్టీ. రాష్ట్రంలో బీసీలకు మొదటిసారిగా పెద్దపీట వేసిన ఘనత టీడీపీదే. కీలకమైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవిని కూడా బీసీలకు ఇచ్చాం'' అని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయి ఉద్యమానికి తమ పార్టీ శ్రీకారం చుడుతోందని ప్రకటించారు. బీసీలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నానని, వంద సీట్లు ఇచ్చి తన ని జాయితీని నిరూపించుకొంటానని ఆయన అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ల కల్పనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
కొన్ని పార్టీలు బీసీలకు చేసిందేమీ లేకపోయినా వారి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని బాబు ఆరోపించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల మధ్య పోటీ ఏర్పడితే అంతిమంగా బీసీలు లాభపడతారని, దానికి టీడీపీ నాంది పలికిందని అన్నారు. ఆగస్టు రెండో వారంలో బీసీల సమస్యలపై కేంద్రం వద్దకు వెళ్తున్నట్లు తెలిపారు.