సచివాలయ ముట్టడి: నారాయణ, రాఘవులు అరెస్ట్
అంతకు ముందు లుంబినీ పార్క్ మీదుగా పెద్ద ఎత్తున వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులుతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాగైనా సచివాలయాన్ని ముట్టడించాలని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పలువురిని పోలీసులు ఎక్కడకికి అక్కడ అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా నారాయణ, రాఘవులులు మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ప్రతిష్టకు పోతోందని మండిపడ్డారు. ఇంధన ఛార్జీలు ఉపసంహరించుకునే వరకు వామపక్షాలు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు. అంతకుముందు సిపిఐ నారాయణ పాదయాత్రతో సిపిఐ కార్యాలయానికి చేరుకున్నారు. అటు నుండి సచివాలయం ముట్టడికి బయలుదేరారు.
మరోవైపు వామపక్షాల ముట్టడి నేపథ్యంలో పోలీసులు సచివాలయం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో మూడు కంపెనీల బలగాలను మోహరించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఎనిమిది గంటల నుండే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.