పరిటాల మనిషి చమన్: జగన్ పార్టీలోకా, బాబుతోనా?

ఈ నెల 28వ తేదీన పరిటాల రవి స్వగ్రామం వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన చంద్రబాబును కలిసి ఆ విషయం చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై కూడా మాట్లాడారు. రాజకీయంగా చురుగ్గా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు కూడా ఆయన చంద్రబాబుకు చెప్పారు. అయితే, తర్వాత మాట్లాడుకుని ఏం చేయాలో చూద్దామని చంద్రబాబు చెప్పినట్లు చమన్ తెలిపారు. ఆయనతో ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ గురువారం సుదీర్ఘంగా మాట్లాడింది. పరిటాల హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చమన్ మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత బయటకు వచ్చారు.
పరిటాల రవితో ఆయన అనంతపురం రాజకీయాల్లో ముఖ్య భూమికనే పోషించారు. ఇప్పుడు కూడా ఆయన అనంతపురం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. తాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. రాజకీయ జీవితంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన ఆ మధ్య చెప్పడంతో వైయస్ జగన్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే, తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తన శ్రేయోభిలాషులు కోరారని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉందని, అప్పటి వరకు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది, ఎలా పోటీ చేయాలనేది ఆలోచించుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రస్తుతం మాత్రం తాను పరిటాల స్వగ్రామానికి వెళ్లి ఈ నెల 28వ తేదీన నివాళులు అర్పించి, ఇంటికి వెళ్తానని, కొంత కాలం ప్రశాంతంగా ఉంటానని, ఆ తర్వాతనే రాజకీయాల గురించి ఆలోచిస్తానని ఆయన చెప్పారు. ఏడాది నుంచి తాను హైదరాబాదులోనే ఉంటున్నానని ఆయన చెప్పారు. పరిటాల రవి అనుచరులు ఎవరు కూడా వైయస్ జగన్ పార్టీలో చేరలేదని, వల్లభనేని వంశీ వైయస్ జగన్ను ఆలింగనం చేసుకోవడం బాధ కలిగించిందని ఆయన అన్నారు.
చమన్ మాటలను బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే, చంద్రబాబు అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారనేది ప్రశ్న. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఉంటానని చమన్ చెప్పారు. పరిటాల మరో సన్నిహత అనుచరుడు పోతుల సురేష్తో తనకు సాన్నిహిత్యం అంతగా లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications