బైరెడ్డితో బాబు మాట్లాడించలేదు: తెలంగాణపై దేవేందర్
అందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలంగాణలో పర్యటించిందని దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఇలాంటి సీమాంధ్ర పార్టీలను తెలంగాణలో భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దొంగ దీక్షలు చేస్తున్నారని, దీన్ని ఈ ప్రాంత ప్రజలు గమనించి, తరిమికొట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రూ.73 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
రాష్ట్ర సర్కారు చేపట్టిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని, ఈ దోపిడీని అరికట్టేందుకే టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ప్రాజెక్టుల యాత్ర చేపడుతున్నామని దేవేందర్ గౌడ్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి టిడిపి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని ప్రకటించారు. రాజ్యాధికారంలో బిసిలకు అందరితో సమానంగా పదవులు కట్టబెట్టాలని, కేవలం పింఛన్లు, రెండు రూపాయలకు కిలో బియ్యంతోనే సరిపెట్టకుండా అన్ని సమాన హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జఠిలమైందని, దీంతో ఎవరికివారు తమ ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని దేవేందర్ గౌడ్ తెలిపారు. టిడిపి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తి కాబట్టే అలా మాట్లాడారు తప్ప, ఆయనతో తమ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడించలేదని స్పష్టం చేశారు. ఎవరెన్నీ మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ అధినేత చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. తెలంగాణలో టిడిపిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషిచేస్తున్నామని దేవేందర్ గౌడ్ తెలిపారు.