అమెరికాలో నేటి నుంచి కొత్త రూల్స్.. భారత్పై పడే దెబ్బ ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. జాతీయ భద్రత, దేశీయ పరిశ్రమల పరిరక్షణే ధ్యేయంగా చట్టాలను ప్రయోగిస్తున్న ఆయన.. తాజాగా ఉక్కు, అల్యూమినియం రక్షణ నిబంధనలను (సెక్షన్ 232) సవరిస్తూ కొత్త ప్రకటనపై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానికంగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. అయితే, అమెరికా మార్కెట్పై కన్నేసిన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఈ నిర్ణయం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
తాజా సవరణల ప్రకారం, దిగుమతి చేసుకునే యంత్రాలలో అమెరికాకు చెందిన ఉక్కు, అల్యూమినియం వాడే తయారీదారులకు ట్రంప్ ప్రభుత్వం భారీగా సుంకాల ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా కంబైన్లు, హార్వెస్టర్ల వంటి వ్యవసాయ పరికరాలపై సుంకాలను 25% నుంచి 15%కి తగ్గించారు. ఈ ఊరట 2027 చివరి వరకు అమల్లో ఉంటుంది. అలాగే బుల్డోజర్లు, ఫోర్క్లిఫ్ట్లు, స్థిర పారిశ్రామిక యంత్రాలు, నివాస రంగానికి చెందిన హెచ్వీఎసీ (HVAC) సిస్టమ్స్పై కూడా 15% సుంకం పరిధిని విస్తరించారు. గతంలో ఉత్పత్తుల్లో కనీసం 95% స్థానిక లోహాలు ఉంటేనే పన్ను రాయితీలు ఇచ్చే రూల్ను, ఇప్పుడు 85%కి సడలించి 10% ప్రభావవంతమైన సుంకానికి దారి సుగమం చేశారు. ఈ కొత్త విధానం 2026 జూన్ 8 నుంచి అమలులోకి రానుంది.

భారత్పై తీవ్ర ప్రభావం.. ప్రతీకార సుంకల వైపు అడుగులు?
ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారత పారిశ్రామిక, వాణిజ్య రంగాలపై గట్టి ప్రభావం చూపించనుంది. అమెరికాకు వ్యవసాయ, పారిశ్రామిక యంత్రాలు, వాటి విడిభాగాలను ఎగుమతి చేసే భారతీయ తయారీదారులకు ఇది పెను సవాలుగా మారబోతోంది. అమెరికా స్థానిక ఉక్కు, అల్యూమినియం వాడితేనే తక్కువ సుంకాలు వర్తిస్తాయి కాబట్టి, భారతీయ ముడిపదార్థాలతో తయారయ్యే వస్తువులకు అక్కడ డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు, గత ఏప్రిల్లోనే ప్రొక్లమేషన్ 11021 ద్వారా లోహ ఉత్పత్తులపై 50% వరకు పన్నులు బాదిన ట్రంప్.. ఇప్పుడు అల్యూమినియం లిథోగ్రాఫిక్ ప్లేట్లు, స్టీల్ ర్యాక్లను కూడా ఈ సుంకాల పరిధిలోకి తెచ్చారు. ఇది భారతీయ ఇంజనీరింగ్ ఎగుమతులపై తీవ్రమైన అదనపు భారాన్ని మోపనుంది.
భారత్ పై ప్రతీకార సుంకాలు?
అమెరికా అనుసరిస్తున్న ఈ కఠినమైన 'అమెరికా ఫస్ట్' విధానాలు ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)కు దారితీస్తున్నాయి. ఇప్పటికే భారతదేశంతో పాటు చైనా, ఐరోపా సమాఖ్య (EU), జపాన్ వంటి కీలక భాగస్వామ్య దేశాలు ట్రంప్ దూకుడుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అమెరికా ఏకపక్షంగా విధిస్తున్న ఈ పన్నులను నిరోధించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో భారత్ సవాళ్లు విసురుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు నష్టం వాటిల్లితే, దానికి ప్రతిగా అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఇతర ఐటీ సేవలపై భారత్ కూడా 'ప్రతీకార సుంకాలు' (Retaliatory Tariffs) విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా సరఫరా గొలుసులపై భారత్ ఎక్కడ దెబ్బకొట్టగలదో ఆ వ్యూహాలను నిపుణులు సిద్ధం చేస్తున్నారు.
సెమీకండక్టర్లు, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ (ఔషధాలు), కీలక ఖనిజాల వంటి రంగాలకు కూడా ట్రంప్ తన సుంకాల వ్యూహాన్ని విస్తరిస్తుండటంతో, గ్లోబల్ లాజిస్టిక్స్ రంగం అప్రమత్తమైంది. ఒకవైపు కెనడా, మెక్సికో, జపాన్, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు ఒక రకమైన రాయితీలు కల్పిస్తూనే, భారత్ లాంటి దేశాల ఎగుమతులపై ఒత్తిడి పెంచేలా వాణిజ్య చదరంగం సాగుతోంది. మరి ట్రంప్ విసిరిన ఈ సుంకాల సవాలును భారత్ ఏ విధంగా ఎదుర్కొంటుంది? దేశీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎలాంటి ఆర్థిక వ్యూహాలతో ముందుకెళ్తుందనేది ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రంగంలో అత్యంత ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications