జయలలిత ప్రభుత్వంపై విజయకాంత్ ఫైర్: పార్టీపై పట్టు
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రిషివంధ్యం నియోజకవర్గంలోని మురికి కాల్వలలో పూడికతీత కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు అడిగామని, అయితే ప్రభుత్వం దీనిపై ఎటువంటి సమాధానం చెప్పలేదన్నారు. గత డిఎంకే పాలనలోలాగే ప్రస్తుతం ఎటుచూసినా అవినీతి కనిపిస్తోందని, దీన్ని నిలదీసే ప్రతిపక్షాలపై ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోందన్నారు. చెన్నయ్లో పలు ప్రాంతాలలో అతిసార వ్యాపించి ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రులపాలవుతున్నారని, అయితే మేయర్ దురైస్వామి అతిసార లేదని వాదిస్తున్నారని చెప్పారు.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1వరకు ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. రాష్ట్రం సమస్యలతో సతమతమవుతుండగా ముఖ్యమంత్రి జయలలిత నెల రోజులుగా కొడనాడు ఎస్టేట్లో విశ్రాంతి తీసుకోవడం న్యాయం కాదన్నారు. అక్కడి నుంచే పథకాలకు కోట్లాది రూపాయల నిధులను కేటాయించినట్లు ప్రకటిస్తున్నారని, అయితే ఒక్క పథకం కూడా అమలు జరగలేదన్నారు.
రాష్ట్రానికి ఎటువంటి మేలు చేకూరదన్న ఉద్దేశంతోనే రాష్ట్రపతి ఎన్నికలను తమ పార్టీ బహిష్కరించిందని, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా తాము దూరంగా వుంటామన్నారు. రాష్ట్రంలో ఐదుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కరుణానిధి ఎల్టిటి ఈ నేత ప్రభాకరన్ బతికున్న సమయంలో ఆయనను కాపాడేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. లంక తమిళులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంలో టెస్సో మహానాడు జరపనున్నట్లు కరుణానిధి చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు.
పార్టీ పైన తనకు పూర్తి పట్టు ఉందని, ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలో తమ పార్టీ ప్రజాప్రతినిధులు తన నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరూ ఓటు వేయలేదని అదే పార్టీపై తన పట్టున్నదనడానికి మంచి నిదర్శనమన్నారు. అనంతరం ఎంజిఆర్ బధిరుల పాఠశాలకు విజయకాంత్ రూ.50 వేల నగదు విరాళంగా అందజేశారు.