సిఎంకు తలనొప్పి: చిరు వర్గం దూకుడు, వైయస్ బొమ్మ
చిరంజీవి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని గంటా శ్రీనివాస రావు బుధవారం అన్నారు. రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు చిరంజీవి ప్రోద్బలంతో మంత్రి పదవులు లభించాయి. చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఇన్నాళ్లు భావించారు. అయితే, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రి వర్గ విస్తరణను గానీ పునర్వ్యస్థీకరణను గానీ చేపట్టడం లేదు. అయితే, పార్లమెంటు వర్షాకాలం సమావేశాల తర్వాత ఆయన విస్తరణ చేపట్టవచ్చునని అంటున్నారు. ఈ విస్తరణలో చిరంజీవికి మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు.
చిరంజీవి ముఖ్యమంత్రి పదవి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం ఆయన వర్గంలో వ్యక్తమవుతోంది. మరోవైపు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణకు చెందిన ఓ వర్గం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు అర్థమవుతోంది. వి. హనుమంతరావు సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఈ వర్గం కూడా చిరంజీవికి మద్దతు తెలుపవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అయితే, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుంది. 2014 ఎన్నికల లోపు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది.
కాగా, మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డిని వైయస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ కలవరపెడుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పెట్టిన చిచ్చు పార్టీలో కలవరం రేపుతోంది. పార్టీలో వైయస్ రాజశేఖర రెడ్డిని అమితంగా అభిమానించేవాళ్లూ, అతిగా వ్యతిరేకించేవాళ్లూ ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం అంతగా సాధ్యమయ్యే పని కాదనిపిస్తోంది.
మంత్రుల్లో చాలా మంది వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారని, వారు వైయస్ జగన్ వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని యువజన కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు సుధాకర్ బాబు చేసిన ప్రకటన కూడా కలవరం సృష్టిస్తోంది. వీరిలో చాలా మంది పిల్లలు, కుటుంబ సభ్యులు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయారు. వైయస్ బొమ్మను అంతటా పెట్టాలని అనేవాళ్లతో పాటు వద్దని డిమాండ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వైయస్ బొమ్మను తీసేయాలని వి. హనుమంతరావు ఇటీవల డిమాండ్ చేశారు. వైయస్ బొమ్మ ఉండాలా, వద్దా అనే విషయంపై తాను స్పందించబోనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. ఆ విషయాన్ని మంత్రుల కమిటీ చూసుకుంటుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ వైపు చిరు వర్గం దూకుడు, మరోవైపు వైయస్ బొమ్మ వివాదం తలనొప్పిగా పరిణమించాయి. అయితే, తాను స్పోర్ట్స్ పర్సన్ను అని, దేన్నైనా నేరుగా ఎదుర్కుంటానని ఆయన ఇటీవలి కాలంలో పదే పదే అంటున్నారు. అంటే, అన్ని సవాళ్లను ఎదుర్కుంటానని ఆయన చెబుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.