నువ్వు బతికున్నావంటే..: జగన్ పార్టీ నేతపై తులసి రెడ్డి
ఆయన ఇంకా భూమ్మీద ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని గుర్తుంచుకోవాలని వారు హితవు పలికారు. సోమవారం గాంధీభవన్లో తులసి రెడ్డి.. సిఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్లు అనిల్, రుద్రరాజు పద్మరాజులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ను వీడినవారంతా జోకర్లు, లోఫర్లు, బ్రోకర్లంటూ చెప్పబోయి పొరపాటున కొండా మురళి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసులో ఉన్నవారంతా భూమాఫీయా నడుపుతున్నవారేనని అన్నారు. కొండా మురళి పదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చారని.. ఆయన చరిత్ర అందరికీ తెలిసిందేనని తులసి రెడ్డి అన్నారు. ఆయన వ్యవహారం నేపథ్యంలో ఇంకా భూమ్మీద బతికి ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పుణ్యమేనని గుర్తుంచుకోవాలని తులసిరెడ్డి సూచించారు.
అనిల్, రుద్రరాజు పద్మరాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసులో చేరిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ రంగారావులపై పార్టీ నాయకత్వమే ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ విప్ అనిల్ చెప్పారు.
గెలిచే సత్తా కలిగిన వారుంటే 100కే పరిమితం కాబోమని 200 శాసన సభా సీట్లను వెనుకబడిన వర్గాలకే ఇస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. మంగళవారం తులసిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బిసి డిక్లరేషన్ పేరిట టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బోగస్ హామీలను కురిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లండన్లో ఒలింపిక్ మెడల్ సాధించినట్లుగా ప్రతిరోజూ ఒక్కో జిల్లాకు చెందిన నేతలను పిలిపించుకుని సన్మానం చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీసీలకు ఏదో చేశానని చంద్రబాబు చెబితే ఆ వర్గం నమ్మేందుకు సిద్ధంగా లేదని తులసిరెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చాలా స్పష్టతతో ఉందని చెప్పారు. మండలి చైర్మన్, పీసీసీ అధ్యక్షుడు కూడా బీసీలేనని అన్నారు.