సీన్ రివర్స్: హజారే దీక్షపై కేంద్రం నో, పైగా విమర్శలు
అన్నా దీక్షకు ఉద్యోగులు, సామాన్యులతో పాటు యువత కూడా మద్దతు పలికింది. గతంలో ఆయన చేసిన దీక్షలు అత్యంత ఘన విజయం సాధించడానికి కారణం యువత మద్దతు పలకడమే. దేశంలో అన్నాకు వచ్చిన మద్దతును చూసి కేంద్రం కూడా గతంలో వణికి పోయింది. ఆయన కోసం ఢిల్లీ పెద్దలు దిగి వచ్చారు. కానీ తాజాగా అన్నా చేపట్టిన ఉద్యమం క్రమంగానీరుగారిపోతోంది.
అందుకు ఆయన లేదా ఆయన బృందం వ్యవహార శైలియే కారణమని అంటున్నారు. కేంద్రమంత్రి శరద్ పవార్ను ఓ వ్యక్తి చెంపపై కొట్టినప్పుడు అన్నా దానిని సమర్థించి ఆ తర్వాత వెంటనే తప్పు పట్టారు. అంతేకాకుండా ఆయన చేపట్టిన ఉద్యమం కేవలం కాంగ్రెసు పార్టీ పైన చేసినట్లుగా ఉంది. కానీ ఎక్కడా ప్రభుత్వంపై చేసినట్లుగా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అవినీతిపై ఉద్యమం అంటూ చేపట్టిన అన్నా బృందం పైనా అవినీతి మరకలు ఉన్నాయి.
ఇలా వరుసగా అన్నా బృందం విమర్శలు ఎదుర్కొంటోంది. తద్వారా దేశ ప్రజల మద్దతు కూడా క్రమంగా కోల్పోతూ వస్తోంది. రెండు రోజుల క్రితం అన్నా బృందం మీడియాపై దాడి చేసింది. తమ దీక్షను సరిగా చూపించడం లేదని వారు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే అన్నా గత సంవత్సరం దీక్ష ప్రారంభించినప్పటి నుండి మీడియా ప్రచారం లేకుంటే ఆయనకు ఇంతగా ప్రాధాన్యత, ఇంత ఫాలోయింగ్ ఉండేదా అనేది మీడియా ప్రశ్న. దాడి ఘటనపై అన్నా హజారే, కేజ్రీవాల్ తదితరులు క్షమాపణ చెప్పారు. అయితే ఇలాంటి సంఘటనలు అన్నా బృందంపై విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది.
ఇలా వివిధ రకాలుగా అన్నా బృందం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం వల్లనే ఈసారి హజారే చేపట్టిన దీక్షకు అంతగా ప్రజల నుండి మద్దతు రాలేదంటున్నారు. ప్రజల నుండి ఎలాగూ మద్దతు రాలేదు. దీంతో కేంద్రం కూడా ఈసారి దీక్షపై స్పందించలేదు. గతంలో అన్నా దీక్ష చేపడతానని ప్రకటిస్తేనే కేంద్రం వణికి పోయేది. కానీ ఇప్పుడు దీక్షకు దిగి నాలుగు రోజులు గడిచినప్పటికీ కేంద్రంలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న దీక్షకు మద్దతుగా అక్కడక్కడా దీక్షలు చేపడుతున్నారే కానీ ఆశించినంత మాత్రం రావడం లేదు.
మరోవైపు అన్నా వైఖరిని మేథావులు కూడా పలువురు తప్పు పడుతున్నారు. జన్ లోక్ పాల్ బిల్లు కావాల్సిందేనని, కానీ అన్నా తాము సూచించిన ప్రకారమే బిల్లు కావలనడం సరికాదని అంటున్నారు. లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ హజారే వైఖరిని తప్పు పడుతున్నారు. అన్నా బృందం తయారు చేసిన జన్ లోక్పాల్ బిల్లులో మార్పులు చేర్పులు ఉండాలని చెబుతున్నారు.
నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్థ్యసేన్ కూడా అన్నా దీక్షను తప్పు పట్టారు. దీక్షలు, ఆందోళనలతో అవినీతిని నిర్మూలించలేమని, వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. జన్ లోక్ పాల్ బిల్లులో మార్పులు చేర్పులు చేయాలని పలువురు మేథావులు చెబుతున్నా అన్నా బృందం మాత్రం తాబట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించడం కూడా ఆయన చేపడుతున్న ప్రజా ఉద్యమం క్రమంగా నీరుగారేందుకు దోహద పడుతోందని అంటున్నారు.
కాగా నోటితో అన్నా దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన ప్రధాని వచ్చినా తాము చర్చకు సిద్ధంగా లేమని, బిల్లుపై హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వైద్యులు ఆయనను పరీక్షించేందుకు వచ్చారు. ఆయన నిరాకరించారు.