లేడీ టెక్కీ నీలిమ మృతి: హత్య కోణంపై పోలీసుల దృష్టి
పోస్టుమార్టం నివేదిక వారం రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. భవనంపై నుంచి ఆమెను తోసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీలిమ ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయి. ఛాతీ, పొత్తి కడుపు, తదితర శరీర భాగాల్లో గాయాలున్నాయి. ఇన్ఫోసిస్ కార్యాలయం ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నీలిమ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమీ కనిపించడం లేదు. స్యూసైడ్ నోట్ కూడా ఏదీ లేదు.
నీలిమ కొద్దిరోజుల్లో భర్తతో కలిసి ఈ నెల 17వ తేదీన అమెరికాకు ప్రయాణం కావాలనుకుంది. ఎంతో సంతోషంతో షాపింగ్ చేసింది. విమాన టికెట్లను కూడా సిద్ధం చేసుకుంది. పుట్టింటి వారితో సహా బంధువులందరికీ ఈ విషయాన్ని చెప్పింది. ఇంతలోనే తీరని విషాదం చోటుచేసుకుంది. పనిచేస్తున్న ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం పైనుంచి కింద పడి మరణించింది. ఆమె మృతి మిస్టరీగా మారింది.
ఆత్మహత్య చేసుకుందని కంపెనీ వర్గాలు చెబుతుండగా, ముమ్మాటికీ తమ కుమార్తెది హత్యేనంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కంపెనీ నిర్వాహకులు తమకున్న పలుకుబడితో కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు బుధవారం అపోలో ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. ఆసుపత్రి వైద్యుల తీరును వారు తప్పుబడుతున్నారు.
వరంగల్ జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన వై.రాణి కూకట్పల్లిలోని ఆర్ఆర్ టవర్స్లో నివాసముంటోంది. ఈమె చిన్న కుమార్తె నీలిమ (27)కు కొద్ది కాలం క్రితం నగరానికి చెందిన సుధాకర్రెడ్డితో వివాహం జరిగింది. నీలిమ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా, సుధాకర్రెడ్డి వొడాఫోన్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. వివాహమైన ఆరు నెలల తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విడివిడిగా ఉంటున్నారు. ఇంతలో నీలిమ ఇన్ఫోసిస్ కంపెనీ తరఫున ప్రాజెక్టు వర్క్ నిమిత్తం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లింది. సెలవుపై ఈమె జూలై 21న నగరానికి వచ్చింది.
తనకు కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో భర్త సుధాకర్రెడ్డికి చెప్పి నీలిమ ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కంపెనీ నిర్వాహకులు సుధాకర్రెడ్డికిఫోన్ చేసి నీలిమ భవనం పదో అంతస్థు పైనుంచి కిందపడిందని, తీవ్రమైన గాయాలయ్యాయని, జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. సుధాకర్ తన అత్త, ఆమె బంధువులతో కలిసి బుధవారం తెల్లవారుజామున అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. నీలిమ మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో వారంతా కుప్పకూలిపోయారు.
తెల్లవారుజామున 4 గంటలకే నీలిమ బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారికి నీలిమ మృతదేహాన్ని చూపించడంలో ఆస్పత్రి సిబ్బంది ఆలస్యం చేశారు. ఆగ్రహానికి గురైన నీలిమ తల్లి రాణి, భర్త సుధాకర్రెడ్డితో పాటు బంధువులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు. చివరకు బంజారాహిల్స్ పోలీసులు కలుగజేసుకొని బంధువులకు నీలిమ మృతదేహాన్ని చూపించారు. ముఖం, చేతితో పాటు పలు చోట్ల గాయాలు ఉండటంతో వారు అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెది హత్యేనంటూ మృతురాలి తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ఫోసిస్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.
నీలిమ మృతి వెనుక అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. నీలిమ పడింది సంస్థ సిబ్బంది 10వ అంతస్థు అని చెబుతుండగా, పోలీసులు మాత్రం ఏడో అంతస్థని చెబుతున్నారు. ఆమె బ్యాగు తొమ్మిదో అంతస్థులో, చెప్పులు ఏడో అంతస్థులో లభ్యమయ్యాయి. సంస్థ సిబ్బంది కూడా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 10.25 గంటలకు ప్రమాదం జరిగితే కుటుంబసభ్యులకు వెంటనే ఎందుకు తెలియపరచలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత పైనుంచి కిందపడితే తీవ్రమైన గాయాలు ఎందుకు కాలేదని ప్రశ్నిస్తున్నారు.
ఎల్బీనగర్కు చెందిన వి.సాహిత్య (23) 2009లో గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరింది. ఆమె గతేడాది ఫిబ్రవరి 18న ఆ భవనంలోని మూడో అంతస్థు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. విదేశాల్లో ఉన్న ప్రేమికుడు పెళ్లికి తిరస్కరించడంతోనే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని రాయదుర్గం పోలీసులు దర్యాప్తులో తేల్చారు.