నెల్లూరు రైలు ప్రమాదం: నిమిషాలలోనే జరిగిందా?
ఈ దుర్ఘటన జరిగిన కోచ్లో రైల్వే పోలీసులు రెండు రోజులు అణువణువు క్షుణ్ణనంగా గాలించి, రహస్య విచారణ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారని తెలుస్తోంది. నివేదిక ప్రకారం అసలు మంటలు ఎలా చెలరేగాయన్నది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిందట. నివేదిక ప్రకారం... తెల్లవారు జామున 4.18 గంటలకు నెల్లూరు స్టేషన్లో మూడో నెంబరు ప్లాట్ ఫారం నుండి రైలు వెళ్లింది.
అక్కడ ఆగదు కాబట్టి దానికి రెండు వైపులా స్టేషన్ అధికారులు రైలు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. స్టేషన్ 2వ నెంబరు ప్లాట్ ఫారంపై డిప్యూటీ సూపరింటెండెంట్ పచ్చజెండా ఊపి రైలు వెళ్లేటప్పుడు పరిశీలించాలి. ఇలా పరిశీలించేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు. నిర్ధిష్టంగా ప్లాట్ ఫారంపై ఎక్కడ నిలబడాలో ఒక వృత్తం గీసి ఉండాలి. అక్కడ నిలబడి రైలు వెళ్లేటప్పుడు కోచ్లను పరిశీలించాలి.
రెండో నెంబర్ ప్లాట్ ఫారంపై సూపరింటెండెంట్, మరో వైపు ఓ ఉద్యోగి నిలబడి తమిళనాడు రైలును పరిశీలించినట్లు చెప్పారు. రికార్డులో వీరు 4.18 గంటలకు రైలు స్టేషన్ వదిలిందని రాశారు. సరిగ్గా 4.20 గంటలకు రైలు పొగలు, మంటలతో రెండు కిలోమీటర్ల దూరంలో ఆగింది. అంటే రెండు నిమిషాల ముందు స్టేషన్లో సిబ్బంది సరిగా పరిశీలించలేదని అర్థమవుతోంది. వీరి పరిశీలిస్తే పొగలు కనిపించేవని, కనీసం ఆ ఛాయలైనా గుర్తించే వారు.
తనిఖీ చేయాల్సిన రైల్వే పోలీసులు ముగ్గురు ఒకేచోట ఉన్నారు. అది నిబంధనలకు విరుద్ధం. తమిళనాడు ఎక్స్ప్రెస్లో జిఆర్పీ సిబ్బంది లేదు. దీంతో పేలుడు పదార్థాలు వెళుతున్నా పట్టుబడే పరిస్థితి లేదు. ఓ సాక్షి కథనం ప్రకారం ప్రమాదం జరిగినప్పుడు అందరూ పరుగులు తీయడంతో ఇద్దరు వ్యక్తులు అడ్డంగా పడిపోయారు. అంతేకాకుండా తలుపులు వెంటనే తెరుచుకోలేదు. ఈ రెండు సంఘటనలు జరగకుంటే మరికొందరు ప్రాణాలతో బయటపడేవారు. మృతుల లెక్క కూడా సరిగా లేదు.