వీధి పోరాటమే: మన్మోహన్కు వైయస్ విజయమ్మ లేఖ
ఎపికి చెందిన సహజవాయు వాటాను మహారాష్ట్రలోని రత్నగిరికి మళ్లించడంపై జోక్యం చేసుకోవాలని ఆమె తన లేఖలో ప్రధానిని కోరారు. ఆగస్టు 1న పెట్రోలియం, సహజవాయువుల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయకపోతే న్యాయం కోసం రాష్ట్ర ప్రజలు వీధులలోకి వస్తారని తెలిపారు. కొన్ని రాష్ట్రాలకు, కొన్ని ప్రాజెక్టులకు తమ ఇష్టానుసారం సహజవాయువును కేటాయించే అధికారం మంత్రుల సాధికారిక బృందానికి లేదని తెలిపారు.
మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఎపిని త్యాగం చేయమనడం సబబు కాదన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ కు నెలలో 12 రోజుల పాటు కోత విధించారని, మంత్రుల బృందం నిర్ణయం వల్ల రాష్ట్ర పరిశ్రమలు ఇకపై నెలంతా కోతలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రత్నగిరిని నిర్మించింది విదేశాల నుంచి ఎగుమతి చేసుకునే ఎల్ఎన్జి ఆధారంగా అని కాబట్టి ఆ ప్రాజెక్టుకు రాష్ట్రం నుండి గ్యాస్ కేటాయించాల్సిన అవసరం లేదన్నారు.
కెజి బేసిన్ గ్యాస్ ఆధారంగా దేశంలో మరెక్కడా గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీ గానీ, విద్యుత్ ప్రాజెక్టు గానీ నిర్మితం కాలేదని అందులో పేర్కొన్నారు. కెజి బెసిన్లో రిలయన్స్కు చెందిన డి6 బ్లాకు నుండి మళ్లీ ఉత్పాదన మొదలైనప్పుడు సహజంగా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ ఇవ్వడం న్యాయమని, ముందు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చాకే ఇతర ప్రాజెక్టులకు ఇవ్వాలని పేర్కొన్నారు.