హైదరాబాద్ టు విజయనగరం: పోలీస్ ఫ్యామిలీస్ ధర్నా
ఈ విషయమై మీడియా సమక్షంలో చర్చకు సిద్ధపడాలని పోలీసు కుటుంబాలు పట్టుపట్టాయి. అందుకు అధికారులు నిరాకరించారు. దీంతో వారు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. కొండాపుర్, చింతలవలసల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల పోలీసుల కుటుంబాలు రోడ్డెక్కే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. చింతలవలసలో పోలీసు కుటుంబాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాదులో కూడా ఆదివారం 8వ బెటాలియన్ వద్ద మరోసారి పోలీసు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వారితో కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రభావం అదిలాబాదును కూడా తాకింది. జిల్లాలోని గుడిపేట13వ బెటాలియన్ ఎదుట పోలీసు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. రేపు అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కోరారు.
కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఎపిఎస్పీ 8వ బెటాలియన్లో కమాండెంట్ తమ భర్తలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ కానిస్టేబుళ్ల భార్యలు శనివారం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. కార్యాలయం ముందు వారు ధర్నాకు దిగారు. సెలవులు మంజూరు చేయకుండా, తమ భర్తల ఆరోగ్య స్థితిని తెలియజేయకుండా కమాండెంట్ తమ భర్తలను వేధిస్తున్నారని వారు ఆందోళనకు దిగారు. ఒక సందర్భంలో ఈ ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తమను వీడియోలో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న ఓ పోలీసును ఎపిఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు చితకబాదారు. వారు తీవ్ర ఆగ్రహంతో అతనిపై విరుచుకుపడ్డారు.
అనారోగ్యంతో బాధపడుతున్నా సెలవులు ఇవ్వకుండా తమ భర్తలను కమాండెంట్ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. గత నెల తూర్పు గోదావరి జిల్లాకు విధులకు వెళ్లిన ఫణికుమార్ అనారోగ్యంతో మరణించాడు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకుండా పోస్టుమార్టం నిర్వహించకుండా అతని శవాన్ని స్వస్థలానికి తరలించారని వారు ఆరోపిస్తున్నారు. ఫణికుమార్ సంఘటన నేపథ్యంలో కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగారు. దాదాపు వేయి మంది భార్యలు కొండాపూర్ కార్యాలయం గేటు వద్ద ఆందోళనకు దిగారు.
కమాండెంట్ వెంకటేశ్వర రావు తమ భర్తలను వేధిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్వర రావును బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎపిఎస్పీ 8వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు తమ పిల్లలతో, తమ కుటుంబ సభ్యులతో వారు ధర్నాకు దిగారు. హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఎపిఎస్పీ కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆమె ఐజి వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఆందోళనను విరమించుకోవాలని ఆమె ఎపిఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలకు ఆమె విజ్ఞప్తి చేశారు.