ఉత్తరాదిని ముంచెత్తిన వరదలు: చిక్కుకున్న ఆంధ్రులు
ఉత్తరాఖండ్లో వరదలు, రహదార్లు దెబ్బతినడం, బోటు సౌకర్యం లేక పోవడంతో వారు అందరూ ఓ హోటల్లో నరక యాతన పడుతున్నారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం దక్కడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే తమకు సహాయ చర్యల అందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో వరదలు వణికిస్తున్నాయి. గంగా, భగీరథి, రావి నదులు పొంగిపొర్లుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో వరదల్లో 22 మంది చిక్కుకు పోగా ప్రభుత్వం వారిని 23 గంటల పాటు రక్షించి కాపాడింది. పలు రాష్ట్రాలలో హైఅలర్ట్ ప్రకటించారు.
వర్షాల కారణంగా మన రాష్ట్రంలోనూ వరదలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని చింతూరులోని చంద్రవంక, సోకిలేరు, చీకటివాగు, అత్తాకోడళ్ల వాగులు పొంగుతున్నాయి. దీంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పదకొండు కేట్లు ఎత్తి వేశారు. 30వేల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 27.4 అడుగులకు చేరుకుంది.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆరు రోజుల క్రితం వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు శ్రీకాకులం జిల్లా కళింగపట్నంలో క్షేమంగా ఉన్నారు. తొలుత వారు వెళ్లిన బోటు ఖాళీగా దొరికింది. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులుఆందోళనకు గురయ్యారు. అయితే ఆ తర్వాత వారి ఆచూకీ లభ్యమైంది. కుటుంబ సభ్యులు మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడారు.
రుతు పవనాలు తమిళనాడును దాటుతున్నాయని, కోస్తా తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని, రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.