సీనియర్లకు కిరణ్కుమార్ చెక్, జిల్లాలకు కొత్త ఇంచార్జ్లు
గత నెలలో మంత్రివర్గ భేటీ సందర్భంగా మార్పుచేర్పుల గురించి ప్రకటించి, అభ్యంతరాలుంటే తెలపాలని ఆయన కోరగా ముగ్గురు నలుగురు మాత్రమే స్పందించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొంత సమయం తీసుకుని కసరత్తు చేసిన సిఎం, సీనియర్లకు కత్తెర వేశారు. ఈ మేరకు డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సహా మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, శత్రుచర్ల విజయరామరాజు, గల్లా అరుణ కుమారి, వట్టి వసంత కుమార్, దానం నాగేందర్లను ఇన్చార్జి బాధ్యతలకు దూరం పెట్టారు.
ఇప్పటికే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నందున వారికి కొత్త బాధ్యత ఇవ్వలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మంత్రుల విశ్లేషణ కమిటీ చైర్మన్గానూ ఉన్న ధర్మాన ప్రసాద రావును విశాఖ జిల్లా ఇన్చార్జిగా నియమించడం గమనార్హం. దీనిపై సోమవారం జారీ అయిన ఉత్తర్వు ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు పార్థసారథి స్థానంలో ఏరాసు ప్రతాప రెడ్డిని నియమించారు. తూర్పు గోదావరికి సబిత, పశ్చిమ గోదావరికి కన్నా లక్ష్మీనారాయణ, కృష్ణాజిల్లాకు తోట నరసింహం, గుంటూరుకు టిజి వెంకటేశ్, ప్రకాశంకు శైలజానాథ్ నియమితులయ్యారు.
విజయనగరానికి విశ్వరూప్, నెల్లూరుకు పితాని సత్యనారాయణ కొనసాగుతారు. చిత్తూరు జిల్లాలో రఘువీరా బదులు పార్థసారథిని నియమించారు. అలాగే అనంతపురానికి గంటా శ్రీనివాసరావు, మహబూబ్నగర్కు ఉత్తమ కుమార్ రెడ్డి, మెదక్కు డికె అరుణ, నిజామాబాద్కు ముఖేశ్ గౌడ్, కరీంనగర్కు పొన్నాల లక్ష్మయ్య, ఖమ్మంకు పసుపులేటి బాలరాజు, నల్లగొండకు సునీతా లక్ష్మారెడ్డిలను వేశారు.
రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్లలో దుద్దిళ్ల శ్రీధర్బాబు, గీతారెడ్డి, బస్వరాజు సారయ్యలను కొనసాగించారు. మార్పుచేర్పులుంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్నా పలువురు సీనియర్లను తప్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా, బాధ్యతల నుంచి తప్పించాలని తానే కోరినట్లు రఘువీరా రెడ్డి చెబుతుండగా ఇన్చార్జిల నియామకం సిఎం విచక్షణాధికారమని డొక్కా అన్నారు.