రాష్ట్రంపై రాహుల్ ఆరా: తెలంగాణపై యుపిఎ దృష్టి

ఆ నేతలు రాహుల్ను కలవడం ఇదే మొదటిసారి కావడంతో ఏం చెప్పాలో తెలియక 'అంతా బాగుంది' అని మాత్రమే చెప్పగలిగారని మీడియా వార్తలు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చివర్లో మరోసారి రాజకీయ పరిణామాల గురించి ఆరా తీయాలని రాహుల్ ప్రయత్నించారు.
కాగా, తెలంగాణపై కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ దృష్టి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. యుపిఎ సమన్వయ కమిటీ తొలి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని, పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ఒక ప్రకటన చేయాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు సమాచారం.
ముందుగా తెలంగాణ అంశాన్ని తేల్చేసి.. ఆ తర్వాత జగన్ను ఎదుర్కొనే విషయంపై దృష్టి సారించడం మంచిదని పార్టీ సీనియర్ నేతలు వయలార్ రవి, గులాంనబీ ఆజాద్ ఇప్పటికే అధినేత్రి సోనియాగాంధీకి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఇక, తెలంగాణపై ఏ వైఖరిని అవలంబించినా, ఆ ఫార్ములాలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలా లేదా మారిస్తే ప్రత్యామ్నాయం ఎవరు? అన్న అంశంపైనా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. పలువురి పేర్లు చర్చకు వస్తున్నా అధిష్ఠానం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
సెప్టెంబర్ రెండో వారం నాటికి ఒక అవగాహనకు రావచ్చునని అంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పూర్తి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, సమస్యలతో వ్యవహరించడం కష్టమని, తన తరం నేతలకు అది సరిపోదని ఆయన భావిస్తున్నట్లు వివరించాయి. ఒకవేళ ముఖ్యమంత్రిని మారిస్తే.. తదుపరి నియమించాల్సిన వారి గురించి అధిష్ఠానం ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో రెడ్డి వర్గానికి చెందిన నేతనే సీఎంగా నియమిస్తే, ఎన్డీఎంఏ వైస్చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి రంగంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్, జానా ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ నేత కాని పక్షంలో సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి పేరు కూడా ముందుకు రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రెడ్డి వర్గానికి చెందిన వారిని నియమించకపోతే తాము కూడా అర్హులమేనని గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు భావిస్తున్నారు.
కాగా, పిసిసి చీఫ్ బొత్సను ఎందుకు నియమించకూడదని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అయితే, మార్చడం కోసమే సీఎం కిరణ్ను మార్చాల్సిన అవసరం లేదని, గతంలో కంటే ఆయన కష్టపడుతున్నారని, కానీ, తెలంగాణ ఫార్ములా, ఇతర సర్దుబాట్ల విషయంలో మార్చాల్సి వస్తే.. అది కూడా సరైన ప్రత్యామ్నాయ నాయకుడు లభిస్తే మార్చే విషయం ఆలోచిస్తామని పార్టీ కోర్ కమిటీ సభ్యుడొకరు రాష్ట్రానికి చెందిన ఓ నేతకు స్పష్టం చేసినట్లు తెలిసింది. సెప్టెంబర్ ఏడో తేదీ తర్వాత రాష్ట్రంలో మాత్రమే కాకుండా కేంద్రంలోనూ తీవ్ర మార్పులు ఉంటాయని, కేంద్ర మంత్రివర్గంలోనూ, పార్టీలోనూ పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications