పేరు చెడగొట్టుకోవద్దు: సిఎంకు పాల్వాయి సూచన
పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రద్దు చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని ఆయన అన్నారు. పోలవరం ద్వారా రాయలసీమకు, తెలంగాణకు 45 టిఎంసిల నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అవి తీసుకోవడానికి తాము ఏమైనా బిక్షగాళ్లమా అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఏమయ్యాయని ఆయన అడిగారు.
పోలవరం టెండర్లలో 600 కోట్ల రూపాయలను పార్టీలన్నీ పంచుకున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నీటి పారుదల ఇంజనీర్లపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు బూటకమని, దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులకు కనీస అవగాహన లేదని ఆయన అన్నారు.
జలయజ్ఞం పేరుతో కాంగ్రెసు ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టులో ఎల్లూరు ఎత్తిపోతల పనులను జిల్లా శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి, రాములు, తదితరులతో కలిసి పరిశీలించారు.
నాటి వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ప్రాజెక్టుల పేరుతో రాష్టాన్ని లూటీ చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అంచనాలు పెంచి నిలువునా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆయన అన్నారు. మంత్రి సుదర్శన్ రెడ్డి శాసనసభ్యులకు కూడా చెప్పకుండా దొంగలా ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు.