సిఎం మార్పు ఉండదు, తెలంగాణ మార్చ్తో..: గవర్నర్
తమ మధ్య అసలు గ్యాస్ చర్చే రాలేదని తోసిపుచ్చారు. ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని, అందుకే ఢిల్లీ వచ్చానని, ఇక్కడికి వచ్చిన తర్వాత పలువురు నాయకులను కలవడం సాధారణమేనని నరసింహన్ చెప్పారు. ఇందులో భాగంగానే మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాం నబీ ఆజాద్, జైపాల్ రెడ్డిలను కలిశానని, వారితో భేటీలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు.
జైపాల్తో సమావేశంలో గ్యాస్ కేటాయింపుపై చర్చించారా? అని అడగ్గా, గ్యాస్ విషయంలో తాను చేయగలిగిందేమీ లేదని, ఈ విషయంలో తన పాత్రకు స్థానం లేదని చెప్పారు. జైపాల్ రెడ్డితో గంటపాటు చర్చించడంపై గవర్నర్ చమత్కారంగా మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి కంటే గవర్నర్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని, సిఎంను మారుస్తున్నారన్న ఊహాగానాలను ప్రస్తావించగా.. అవన్నీ మీడియా ప్రచారాలేనని, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని గవర్నర్ చెప్పారు.
సిఎం ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అని, ఆయనే ప్రభుత్వాన్ని పాలిస్తారని చెప్పారు. గ్యాస్ ఇప్పటికే వచ్చేసిందని, మెడికల్ సీట్ల అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. గ్యాస్ విషయంలో ముఖ్యమంత్రి సఫలమయ్యారని తెలిపారు. పోలవరం నిర్మాణంలో ముందుకే వెళతామన్న ముఖ్యమంత్రి ప్రకటనను ప్రస్తావించగా.. ఏది జరిగినా ప్రజల సంక్షేమం కోసమే జరుగుతుందని, సరిపడినన్ని సహాయ, పునరావాస చర్యలు ఉంటాయని చెప్పారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని కమిటీ పని చేస్తోందని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎలా అమలు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేందుకు చేస్తున్న కృషిలో భాగమే తాజా ఆర్డినెన్స్ అని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారని అడగ్గా, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కాలా కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
ఇక హోం మంత్రి షిండే గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పని చేసినందున రాష్ట్రం గురించి ఆయనకు తాను వివరించేది ఏమీ లేదని నరసింహన్ తెలిపారు. తెలంగాణ మార్చ్తో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్నారు. అంతకముందు గవర్నర్ నరసింహన్ కేంద్రమంత్రులు చిదంబరం, ఆజాద్, జైపాల్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండేలను కలిశారు.