నిమ్మగడ్డతో కలిసి మంత్రి ధర్మాన కుట్ర: సిబిఐ
వాన్పిక్గానూ మొత్తం 6,776 ఎకరాల భూమిని కేటాయించారని, నిమ్మగడ్డకు కేటాయించిన భూమిపై పరిశ్రమల శాఖకు సమాచారం ఇవ్వలేదని, నిమ్మగడ్డకు అనుకూలంగానే మంత్రి పనిచేశారని సిబిఐ చార్జీషీటులో పేర్కొంది. వాన్ పిక్ పోర్టుకే కాకుండా వాన్పిక్ ప్రాజెక్టుకు మేలు చేకూరేలా మంత్రి ధర్మాన భూములు కేటాయించారని సిబిఐ ఆరోపించింది. వాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి 'రస్ ఆల్ కైమా' ఇచ్చిన రూ. 450 కోట్లలో 150 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు చెల్లించారని, మిగతా 300 కోట్ల రూపాయలకు లెక్క తేలాల్సి ఉందని సిబిఐ తెలిపింది.
జిఎడి ముఖ్య కార్యదర్శిని కాదని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి మంత్రి ధర్మాన ఫైళ్లు పంపించారని, సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని సిబిఐ చార్జీషీట్లో పేర్కొంది. వైఎస్ హయాంలో ధర్మాన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా జగన్ అక్రమాస్తులు, వాన్పిక్ భూముల కేటాయింపు వ్యవహారం కేసులో 14 మందిని నిందితులుగా చేర్చుతూ సిబిఐ సోమవారం మధ్యాహ్నం 177 పేజీలతో కూడిన చార్జీ షీటును 9 సీల్ బాక్స్ల్లో పెట్టి నాంపల్లి కోర్టులో సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో ఏ-5గా మంత్రి ధర్మానను సీబీఐ పేర్కొన్న విషయం విదితమే.
భూముల కేటాయింపు విషయాన్ని ధర్మాన ప్రసాద రావు పెట్టుబడుల శాఖకు తెలియజేయలేదని సిబిఐ చెప్పింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ధర్మాన ప్రసాద రావు ఉన్నట్లు తెలుస్తోంది.