వైయస్ జగన్ను టార్గెట్ చేస్తే మిస్ ఫైర్ అయిందా?
శంకరరావు లేఖతో కోర్టు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ దర్యాప్తు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే చుట్టుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని సభ్యులకు కూడా పట్టుకుంది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో పడినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అరెస్టయి జైలులో ఉండగా, తాజాగా ధర్మాన ప్రసాద రావు చిక్కుల్లో పడ్డారు. వాన్పిక్ వ్యవహారంలో తనను సిబిఐ తనను చార్జిషీట్లో నిందితుడిగా చేర్చడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇంకా నలుగురు మంత్రులు వరుసలో ఉన్నారనే మాట వినిపిస్తోంది. మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, జె. గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ ఈ వరుసలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. ఇద్దరి విషయం తేలిపోగా మిగతా నలుగురు కూడా చిక్కుల్లో పడక తప్పదనే మాట వినిపిస్తోంది. దీంతో వారిని ఎలా కాపాడాలో తెలియక కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళనలో పడినట్లు చెబుతున్నారు.
మంత్రి పార్థసారథిని మరో కేసులో కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా ఖరారు చేసింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం పరిస్థితి ఏమిటో అర్థం కాని కావడం లేదని అంటున్నారు. మంత్రి వర్గ సమావేశాన్ని జైలులో పెట్టుకోవాల్సి వస్తుందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.
సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురిలో మోపిదేవి వెంకటరమణ మినహా మిగతా ఐదుగురికి న్యాయ సహాయం అందించాలనే కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం కూడా వివాదంగా మారింది. న్యాయ సహాయం అందించడం ద్వారా ముఖ్యమంత్రి అవినీతిపరులను బలపరుస్తున్నారనే వ్యాఖ్యలు నిత్యం వస్తున్నాయి. ప్రస్తుతం పరిణామం వైయస్ జగన్ కన్నా కాంగ్రెసు పార్టీకే ఎక్కువ నష్టం చేసేలా ఉందనే మాట వినిపిస్తోంది.