పాక్ నుండే చిచ్చు: ఇంటర్నెట్ పేజీల ఖాతాలు బ్లాక్
పాక్ కేంద్రంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తప్పుడు చిత్రాలు, కథనాలను ప్రచారం చేసి మతవిశ్వాసాలను దెబ్బతీయడానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షిండే కోరారు. అయితే తగిన ఆధారాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని మాలిక్ హామీ ఇచ్చారు. అస్సాం హింసకు సంబంధించిన వదంతుల వ్యాప్తిలో పాకిస్థాన్ హస్తం ఉందంని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సింగ్ శనివారం చెప్పారు. భారీ సంఖ్యలో మార్ఫింగ్ చిత్రాలను పాకిస్థాన్ నుంచే వెబ్సైట్లలోకి ప్రవేశపెట్టారని సింగ్ చెప్పారు.
మరోవైపు ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్లలోని 80 ఇంటర్నెట్ పేజీలు, ఖాతాలను బ్లాక్ చేయాలంటూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్ఫింగ్ చిత్రాలు కలిగున్న 76 వెబ్సైట్లను ఇప్పటికే బ్లాక్ చేసింది. కాగా, అసోంలో ఇప్పటికీ హింస చల్లారడం లేదు. శనివారం రాత్రి ధూబ్రి జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడగా.. చిరాగ్ జిల్లాలో కొన్ని ఇళ్లను దుండగులు తగులబెట్టారు.
కాగా, బెంగళూరు-గువహటి ఎక్స్ప్రెస్ ట్రైన్ నుంచి కొందరు ప్రయాణికులను గుర్తు తెలియని వ్యక్తులు బయటకు నెట్టేయడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. న్యూజల్పాయ్గురికి కొద్ది కిలోమీటర్ల దూరంలోని బేలకోబా రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు.