కుదిపేసిన కోల్గేట్: పార్లమెంటు ఉభయసభలూ వాయిదా
కాగ్ నివేదికలోని అంశాలపై ప్రధానమంత్రి వివరణ ఇవ్వడమేకాకుండా తక్షణం రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) పట్టుబట్టింది. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభంకాగానే ఇరు సభల్లో బొగ్గు స్కామ్ను లేవనెత్తడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. దీంతో లోక్సభను స్పీకర్ మీరా కుమార్, రాజ్యసభను ఛైర్మన్ హమీద్ అన్సారీలు రేపటికి వాయిదా వేశారు.
బిజెపి పార్లమెంటు సభ్యులకు అన్నాడియంకె, వామపక్షాలు, తెలుగుదేశం సభ్యులు మద్దతు పలికారు. ప్రతిపక్షాలను తిప్పికొట్టడానికి అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాను ఎంతగా సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో రవి శంకర్ ప్రసాద్, వెంకయ్యనాయుడు నేృతృత్వంలో బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు.
ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాగ్ నివేదికపై చర్చ కోసం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరావు స్పీకర్ మీరాకుమార్కు నోటీసు ఇచ్చారు. బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలు, రిలయన్స్ వ్యవహారంపై చర్చ జరగాలంటూ ఆయన స్పీకర్ను ఆయన కోరారు.