ధర్మాన రాజీనామా ఆమోదం: నలుగురిపై వేటు

Dharmana Prasad Rao
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇరుక్కున్న ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాలని కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా నలుగురు మంత్రులపై కూడా వేటు వేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో గంటా 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వాయలార్ రవిని కలిశారు.

సోనియాతో జరిగిన సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆహ్వానించలేదు. ధర్మాన రాజీనామాను ఆమోదిస్తే సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా మంత్రుల విషయంలో ఎలా వ్యవహరించాలనే మీమాంసకు అధిష్టానం సమాధానం చెప్పింది. నాయకత్వ మార్పు లేకుండా ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిలను మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశాలున్నాయి. శుక్రవారం గానీ శనివారం గానీ ఆమోదం కోసం ధర్మాన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు పంపే అవకాశం ఉంది.

నాయకత్వ మార్పులకు కాంగ్రెసు అధిష్టానం తెర దించినట్లేనని భావించాలి. తెలంగాణపై నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటే నాయకత్వ మార్పు గురించి ఆలోచించాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశాలున్నాయి. తన మంత్రివర్గాన్ని ఆయన పునర్వ్యస్థీకరిస్తారని అంటున్నారు. కళంకిత మంత్రులను మంత్రివర్గంలో కొనసాగించడం వల్ల వచ్చే విమర్శలను తొలగించుకోవడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. అయితే, నలుగురు మంత్రులకు ఇప్పుడే ఉద్వాసన పలికే అవకాశం లేనట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వారి పేర్లు చార్జిషీట్‌లో వచ్చినప్పుడు వారు ఎలా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వేటు వేయాలని అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అందరినీ తొలగించి కొత్త మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అడిగినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కోరిక ఎప్పుడు నెరవేరుతుందనేది ఇప్పుడే చెప్పలేని స్థితి. అయితే, మిగతా నలుగురు మంత్రులకు కూడా ఉద్వాసన పలకాలనే నిర్ణయం అధిష్టానం వద్ద జరిగినట్లు ఓ వాదన బలంగా వినిపిస్తోంది.

బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పొసగడం లేదని భావించిన అధిష్టానం సమన్వయానికి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని మార్చాలనే తొలుత భావించినప్పటికీ దాని వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావించినట్లు తెలుస్తోంది. తనకు తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. నలుగురు మంత్రులపై వేటు వేయడం ద్వారా తాము అవినీతికి అవకాశం ఇవ్వబోమనే సంకేతాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+