లగడపాటికి టీ విందు, మాపై క్రూరత్వమా: హరీష్ రావు
పోలీసులే తెరాస శాసనసభ్యులపై దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. పోలీసులు కేసు పెడితే పెట్టనివ్వండి, తాను న్యాయస్థానంలో పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసు భద్రతతో విద్యుత్ సౌధాకు తీసుకుని వెళ్లిన పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్ర తమ పట్ల మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఎవరూ అడక ముందే తాను బొల్లారం పోలీసు స్టేషన్లో క్షమాపణలు చెప్పానని ఆయన గుర్తు చేశారు.
ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు తమ నియోజకవర్గాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాము విద్యుత్ సౌధాలో సిఎండిని కలిసేందుకు వెళ్లామని ఆయన చెప్పారు. తాము ధర్నా చేయడం లేదని, తాము కేవలం అధికారులను కలిసి రైతు సమస్యలను వివరించేందుకు వెళ్తున్నామని, తమకు రక్షణ, బందోబస్తు అవసరం లేదని డిసిపి, కమీషనర్లకు ఫోన్ చేసి చెప్పామని ఆయన వివరించారు. తాము అక్కడికి చేరుకోక ముందే పోలీసులు చేరుకుని తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన అన్నారు.
పోలీసులు దురుసుగా ప్రవర్తించినా తాము సహనం వహించామని, తమను రౌడీల మాదిరిగా చూశారని ఆయన అన్నారు. తాము రౌడీలమా, గూండాలమా అని ప్రశ్నించామని, అయినా తమను బూట్లతో తొక్కారని, అంగీలను చించివేశారని ఆయన ఆరోపించారు. రవాణా భవన్ వద్ద సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు టీ విందులతో స్వాగతం పలికారని ఆయన గుర్తు చేశారు. మధు యాష్కీతో పాటు తాము వెళ్తే తమపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని ఆయన అన్నారు.
అదే రోజు తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు స్వామి గౌడ్పై హత్యాయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. డిసిపి స్టీఫెన్ రవీంద్ర గురించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఏ విద్యార్థిని అడిగినా చెబుతాడని ఆయన అన్నారు. డిసిపి స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉస్మానియాలోని విద్యార్థులను రవీంద్ర నరకయాతనకు గురి చేశారని ఆయన అన్నారు. పోలీసులు తమ పట్ల దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.