పెండింగులో నాయకత్వ మార్పు: బొత్స, కిరణ్ రెడ్డి సేఫ్
తొలుత నాయకత్వ మార్పు గురించే పార్టీ అధిష్టానం ప్రధానంగా ఆలోచన చేసింది. అయితే, ముఖ్యమంత్రి పరిస్థితిని వివరించిన తర్వాత అధిష్టానం తన ఆలోచనను మార్చుకున్నట్లు చెబుతున్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై ఇప్పటి వరకు తాను నిర్ణయం తీసుకోకపోవడానికి గల కారణాలను ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించినట్లు సమాచారం. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదిస్తే దాని ప్రభావం సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా మంత్రులపై కూడా పడుతుందని, అలా పడితే తాను ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వాదన విన్న తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి, కళంకిత మంత్రులను తొలగించడం ద్వారా ప్రభుత్వంపై దాని ప్రభావం పడకుండా చూసుకోవడమే కాకుండా కేసులు ఎదుర్కుంటున్నవారు ఎవరైనా సరే తాము సహించబోమనే సంకేతాలను పంపినట్లు అవుతుందని భావించినట్లు చెబుతున్నారు. మంత్రి వర్గ ప్రక్షాళన వెంటనే జరుగుతుందా, సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేసే క్రమంలో ఒక్కో మంత్రినే తొలగిస్తూ పోతారా అనేది తేలడం లేదు. మొత్తం మీద మిగతా నలుగురు మంత్రులను కూడా ధర్మాన దారిలోనే పంపించాలని అనుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, పార్టీ కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేయాలని అధిష్టానం బొత్స సత్యనారాయణకు చెప్పినట్లు తెలుస్తోంది. తాను పిసిసి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలను చేపట్టిన తర్వాత తనదంటూ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయానని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి విషయంలోనూ, పార్టీపరంగా బొత్స సత్యనారాయణ విషయంలోనూ అదే జరిగింది. దాంతో తమ జట్లను ఏర్పాటు చేసుకోలేనప్పుడు తాము సమర్థంగా ఎలా పనిచేయగలుగుతామని వారు అధిష్టానం పెద్దలతో అన్నట్లు తెలిసింది.
ఇరువురికి కూడా తమ జట్లను ఏర్పాటు చేసుకుని కొంత కాలం చూడాలనే నిర్ణయానికి వచ్చి అధిష్టానం నాయకత్వ మార్పును పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. తెలంగాణపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని బొత్స సత్యనారాయణతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. ఏమైనా, సంక్షోభం నుంచి తాత్కాలికంగా ఇరువురు నాయకులు కూడా బయటపడినట్లేనని భావిస్తున్నారు.