తెలంగాణపై సోనియాకు పవార్: బాబు లేఖపై చర్చ
రాష్ట్రంలో పరిస్థితులు చేజారిపోతున్నట్లు తనకు సమాచారం అందిందని, ఇంకెంతమాత్రం ఆలస్యం చేయరాదని సమావేశంలో కోరినట్టు ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఆ అంశంపై పెద్దగా చర్చ జరగలేదని, అందరూ దాదాపు తనతో ఏకీభవించారని ఆయన చెప్పారు.
ఇదిలా వుంటే, ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇచ్చిన తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయనేదానిపై రాష్ట్ర పార్లమెంటు సభ్యుల్లో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఈ విషయం చర్చించినట్లు తెలిసింది.
రెండు రోజుల క్రితం లగడపాటి రాజగోపాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు కూడా తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటివారంలో తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇచ్చి మరోసారి కేంద్రానికి లేఖ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై చంద్రబాబు పట్టుదలతోనే ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇస్తే కాంగ్రెసు పార్టీ ఇరకాటంలో పడిపోతుందని అంటున్నారు. తాము పూర్తిగా ఆత్మరక్షణలో పడాల్సి వస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు భావిస్తున్నారు. దీంతో తెలంగాణపై పార్టీ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రాంత నాయకులే కాకుండా సీమాంధ్ర నాయకులు కూడా తెలంగాణ అంశాన్ని తక్షణమే తేల్చాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.