న్యూయార్క్ దుండగుడి కాల్పులు: ఇద్దరు మృతి
న్యూయార్క్లో స్థానిక కాలమాన ప్రకారం ఉదయం తొమ్మిది గంటల వేళ, అందరూ కార్యాలయాలకు పరుగులు తీస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈలోగా పోలీసులు ఆ వ్యక్తిపై కాల్పులు జరపగా, అతడు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వైపు వాహనాల రాకపోకలను పక్కకు మళ్లించారు.
తమకు కాల్పుల శబ్దం వినిపించిందని, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వాహనాలను ఆపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎంపైర్ బిల్డింగ్ సమీపంలోని ప్రాంతంలోకి పోలీసులు, ఫెడరల్ ఏజెన్సీ అధికారులు దిగడంతో ఫిప్త్ ఎవెన్యూను పాక్షికంగా మూసేశారు. అమెరికాలో ఇది అత్యంత పర్యాటక ఆసక్తి గల ప్రాంతం.
ఈ సంఘటనతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికాలో ఆగంతకుల కాల్పులు ఇటీవలి కాలంలో సాధారణంగా మారినట్లు కనిపిస్తోంది. ఇటీవల రెండు విచక్షణారహిత కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. బ్యాట్మన్ సినిమా ది డార్క్ రైట్ రైజెస్ ప్రదర్శన సందర్భంగా జులై 20వ తేదీన ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12 మంది మరణించారు, 58 మంది గాయపడ్డారు. ఆగస్టు 5వ తేదీన సిక్కు ఆలయం వద్ద ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.