ఎస్సెమ్మెస్లు పంపితే అరెస్టులా, వారి సంగతేంటి: బాబు
అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలను సైతం అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కును సైతం కాంగ్రెసు ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఎస్సెమ్మెస్లు పంపారన్న ఆరోపణల పైనే చిన్నపురెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం... ప్రజాధనాన్ని దోచిన మంత్రులు, రాజీనామా చేసిన మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చిన్నపురెడ్డి అరెస్టును మరోనేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఖండించారు.
చిన్నపు రెడ్డి నుండి స్వాధీనం చేస్కున్న భూమిని తిరిగి ఆయనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డికి వ్యతిరేకంగా ఎస్సెమ్మెస్లు పంపించారన్న ఆరోపణలపై సిఐడి అధికారులు తెలుగుదేశం పార్టీ నేత తేరా చిన్నప రెడ్డిని శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనిని 6వ అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. చిన్నప రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 2009లో చిన్నపరెడ్డి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గత మూడు దశాబ్దాలుగా జానా రెడ్డి రూ.వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని, ఇతర ప్రాంతాలలో విద్యుత్తు ప్రాజెక్టులు కలిగి ఉన్నారంటూ కొందరికి ఎస్సెమ్మెస్లు వెళ్లాయి. ఈ విషయాన్ని జానా తీవ్రంగా పరిగణించి, సైబర్ నేరాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో జానా పరువుకు భంగం కలిగించేలా పలువురికి సంక్షిప్త సందేశాలు(ఎస్సెమ్మెస్లు) పంపారన్న అభియోగంపై అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన చిన్నపరెడ్డి కొన్నేళ్లు అమెరికాలో ఉండి తిరిగి వచ్చారు. 2009 ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థిగా జానా రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి మంత్రి జానా రెడ్డికి, చిన్నప రెడ్డికి మధ్య రాజకీయంగా పోరు కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో జానా రెడ్డి తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ పేరుతో పదవులు సంపాదించుకున్నారని, ఆస్తులు పోగుచేసుకున్నారని, అక్రమాస్తులపై విచారణ జరిపించాలని తదితర ఎస్ఎంఎస్లు నియోజకవర్గ ప్రజలకు పంపినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దీనిపై జూన్ చివరి వారంలో మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక దర్యాప్తు చేసిన సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్లో చిన్నప రెడ్డిని అరెస్టు చేశారు.
వైద్య పరీక్షల కోసం నిమ్స్కు వచ్చిన చిన్నపరెడ్డి.. ప్రజాసేవ చేద్దామని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానని, ఈ చెత్త రాజకీయాల్లోకి లాగి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వాపోయారు. ఇలాంటి వాటికి భయపడబోనని జానా రెడ్డి అవినీతిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. జానారెడ్డి తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. జానాకు వ్యతిరేకంగా ఎస్సెమ్మెస్లు పంపాననేది వాస్తవం కాదన్నారు.