కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైట్: బొత్స ఇంట్లో మంత్రాంగం
మంత్రి వర్గ ప్రక్షాళణ మాత్రమే జరుగుతుందని, సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులను ముఖ్యమంత్రి తొలగించి, కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొంత మంది గట్టిగానే వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకులు ఏకమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం బొత్స సత్యనారాయణ నివాసంలో డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె. జానా రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, బాలరాజుతో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రిని మారుస్తారని విశ్వసిస్తున్న ఆ నాయకులు ఆ పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను కూడా మార్చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో చిరంజీవిని పిసిసి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు.
బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య సమన్వయం కుదిరించడానికి పార్టీ అధిష్టానం పెద్ద యెత్తున కసరత్తు చేసింది. ఉప ఎన్నికల సమయంలో కలిసి పని చేసినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ యెడం పెరిగింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో వారిద్దరు కలిసి వ్యవహరించిన దాఖలాలు లేవు. ఓ ఐదు నిమిషాల పాటు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిసి తన దారిన తాను వెళ్లిపోయారు.
తెలంగాణపై కూడా కచ్చితమైన నిర్ణయం తీసుకునే క్రమంలో పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని మార్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సెప్టెంబర్ రెండో వారంలోగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ స్పష్టమైన ప్రకటన చేయవచ్చుననే మాట వినిపిస్తోంది.