రాష్ట్రంపై రాహుల్ దృష్టి: సిఎంగా కొత్త పేరు ప్రస్తావన!
ఆదివారం కోర్ కమిటీతో సోనియా గాంధీ నిర్వహించిన సమావేశంలో ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది. అసోంలో శనివారం మళ్లీ అల్లర్లు చెలరేగి.. ఐదుగురు మరణించడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హడావిడిగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐసిసిప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే విస్తృతంగా చర్చించారు.
అసోంపై సమీక్షించిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి బాగోలేదన్న విషయంపై వారు కొద్దిసేపు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు సోనియా తాను తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నాయకత్వం, తెలంగాణ తదితర అంశాలపై కొద్దిసేపు చర్చలు జరిగినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జానా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి శ్రీనివాస్ పేర్లు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ నలుగురి గుణగణాలను, వారి వల్ల రాష్ట్రంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కలిగే లాభ నష్టాలపై కొద్దిసేపు చర్చించారు. అప్పటి వరకు ఈ చర్చను మౌనంగా వింటున్న రాహుల్ గాంధీ ఉన్నట్లుండి పెదవి విప్పి రాష్ట్రం గురించి తన అభిప్రాయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తనకైతే ఫలానా వ్యక్తి ఉంటే బాగుంటుందనిపిస్తోందని రాహుల్ చెప్పారట. దీంతో మిగతా నేతలంతా తమ అభిప్రాయం చెప్పకుండా మౌనం పాటించారట. అయితే రాహుల్ ఎవరి పేరు ప్రస్తావించారు.. ఆయన ఏ అభిప్రాయాలు ప్రకటించారన్న విషయం మాత్రం రహస్యంగా ఉండిపోయింది.