మాకు చెప్పకుంటే ఎలా?: నామాపై హరికృష్ణ ఆగ్రహం
అయితే తాను అందరికీ సమాచారం అందించానని, కానీ ఎందుకు అందలేదో తనకు తెలియదని నామా... హరికృష్ణకు చెప్పారని తెలుస్తోంది. అందుకు హరికృష్ణ తనకు సిపిఐ రైతు సదస్సు విషయం ఈ రోజు పేపర్లో చూసే వరకు తెలియదని, ఆ సమావేశానికి పార్టీ బృందం వచ్చినట్లుగా కూడా పత్రికల్లో చూస్తేనే తెలిసిందని హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఎంపీలు కూడా నామా తీరుపై అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు. ఎంపీల మధ్య సమన్వయం లేకుంటే ఎలా అని హరికృష్ణ నామాను ప్రశ్నించారు.
కాగా మంగళవారం న్యూఢిల్లీలో సిపిఐ పార్టీ రైతు సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తొలుత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కావాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. పార్టీ తరఫున కరణం బలరాం బృందాన్ని బాబు ఢిల్లీకి పంపించారు. ఈ సదస్సులో కరణం బృందం కిందనే కూర్చోగా.. నామా నాగేశ్వర రావు, ఎర్రన్నాయుడు మాత్రం డయాస్ పైన కూర్చోవడం గమనార్హం.