బాబుతో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత భేటీ

శాసనసభ ఆవరణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సహకరించాలని ఆమె చంద్రబాబును కోరినట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేయాలని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తాము శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సానుకూలంగానే ఉన్నామని చంద్రబాబు కవితతో చెప్పినట్లు సమాచారం.
అంబేడ్కర్ విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో ప్రభుత్వం నెలకొల్పే విధంగా తమ వంతు కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు. శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతూ కవిత కొంత కాలంగా ప్రచారోద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు బివి రాఘవులు, కె. నారాయణ కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యపై ఉమ్మడి పోరుకు కలిసి రావాలని కోరేందుకు వారు చంద్రబాబును కలిసినట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి సిపిఐ సన్నిహితంగా వ్యవహరిస్తుండగా, సిపిఎం మాత్రం దూరంగా ఉంటోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అంటుండగా తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుత పరిస్థితికి వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని, అటువంటప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కులుపుకుని పోవడం సరి కాదని వాదిస్తోంది.












Click it and Unblock the Notifications