'గాలి' డబ్బు కాంగ్రెస్కూ, నాకు కాదు: లాలూకు సుష్మా
బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ స్పందించారు. రెడ్డి బ్రదర్స్ బిజెపి నేతలకు పెద్దఎత్తున ముడుపులు ముట్ట చెప్పారన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అని లాలు ఆరోపించారు.
ఆ వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్ ట్విటర్లో స్పందించారు. రెడ్డి బ్రదర్స్ నుంచి భారీ ముడుపులు ఎవరు తీసుకున్నారో లాలు ప్రసాద్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయనతో పాటు దేశానికి కూడా నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి కూడా ముడుపులు అందాయని, ఆ పార్టీ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వమే గాలి బ్రదర్స్కు గనులన్నీ కేటాయించిందని చెప్పారు.
గాలి బ్రదర్స్కు కేటాయించిన గనులు, వాటికి సంబంధించిన సిఫారసులను బయట పెట్టాలని, గాలి బ్రదర్స్కు ఎవరు సిఫారసు చేశారో, ఎవరికి ఆర్థికంగా లబ్ధి చేకూరిందో వంటి నిజాలన్నీ ప్రజలకు తెలుస్తాయని, వాస్తవాలు అన్నిటినీ జాతి ముందుంచాలని సుష్మ డిమాండ్ చేశారు. గాలి బ్రదర్స్ నుంచి తనకు పైసా కూడా ముట్టలేదని, కానుకలూ తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా, సుష్మ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించేందుకు బిఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు నిరాకరించారు