ఇందిరా గాంధీకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ క్షమాపణ చెప్పిన వేళ
తన సహచర వ్యోమగామి ఎడ్విన్ ఆల్డ్రిన్తో కలిసి యాత్రలో భాగంగా ఢిల్లీకి వచ్చారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అప్పుడు ఇందిరా గాంధీని కలిశారు వారు. ఈ సమయంలో అతను ఇందిరకు క్షమాపణలు చెప్పారని ప్రత్యక్ష సాక్షి, విదేశాంగశాఖ మాజీ మంత్రి కె.నట్వర్ సింగ్ మంగళవారం తెలిపారు. ఇందిరను కలుసుకునేందుకు వచ్చిన నీల్, ఎడ్విన్లకు కేంద్రపెద్దలు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో నట్వర్ సింగ్కు మాట్లాడే అవకాశమిచ్చారు.
దీంతో సింగ్ మాట్లాడుతూ... మీరు చంద్రునిపై అడుగుపెట్టే అపురూపమైన దృశ్యాలను వీక్షించాలన్న ఆకాంక్షతో ప్రధాని ఇందిరా గాంధీ తెల్లవారుజాము వరకు మెలుకువతో ఉన్నారని చెప్పారు. దీంతో కలుగజేసుకున్న నీల్.. ఇందిరకు వెంటనే క్షమాపణలు చెప్పి, మరోమారు ఇలా మిమ్మల్ని ఎదురు చూడనివ్వకుండా భారత కాలమానం ప్రకారమే తన అంతరిక్షయాత్రను కొనసాగిస్తానని వినమ్రంగా చెప్పారని నట్వర్ సింగ్ మంగళవారం తెలిపారు.