తారాచౌదరి ఎపిసోడ్: ఎంపీ రాయపాటికి దక్కని పదవి?
ఈసారి కూడా పార్టీ పెద్దలు రాయపాటి సాంబశివ రావు పేరును చైర్మన్ పదవి కోసం పరిశీలించారు. ఆఖరు వరకు ఆయనకే ఇవ్వాలని భావించారట. అయితే చివరి నిమిషంలో ఆయనకు కాకుండా రెండేళ్లుగా ఆ పదవిలో ఉన్న కనుమూరి బాపిరాజుకే ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయానికి వచ్చారట. ఈ నిర్ణయం వెనుక తారా చౌదరి ఎపిసోడ్ ఉందనే వ్యాఖ్యలు గుప్పుమంటున్నాయి. తారా చౌదరి కేసులో రాయపాటి పేరు వినిపించిన విషయం తెలిసిందే.
పార్టీ పెద్దలు టిటిడి చైర్మన్ పదవి పేరును రాయపాటికి కట్టబెట్టాలని నిర్ణయించుకున్న సమయంలో ఆయన వ్యతిరేక వర్గం ఢిల్లీ ముఖ్య నేతలను కలిసి తారా వ్యవహారం నివేదికను ఉంచారట. దీంతో అవాక్కయిన పెద్దలు రాయపాటికి కాకుండా తిరిగి కనుమూరికే అప్పగించారని అంటున్నారు. కనుమూరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధినేత్రి మూడ్ మారకముందే దీనిని అంగీకరించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇందుకు కావాల్సిన సంతకాలు చక చకా జరిగిపోయాయట.