తెలంగాణ వచ్చేస్తోంది, చిరుకి, సిఎంకీ చెప్పారు!: కేసిఆర్
దీంతో ఈ నెల రెండో వారంలో ఆ తర్వాత ఏం జరగబోతోందనే ఉత్కంఠ తెరాస, ఐకాస వర్గాల్లో ప్రారంభమైంది. కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకున్నా.. ఇక్కడి రాజకీయ వర్గాలు, తెలంగాణవాదుల్లో రకరకాల ప్రచారాలు జోరందుకుంటున్నాయి. సెప్టెంబర్ రెండు, మూడు వారాల్లో తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తుందని, ఈ విషయాన్ని సోనియానే తనకు స్వయంగా చెప్పారని, ఇక తెలంగాణ డిక్లేర్ చేయటం తప్ప దీనిపై చర్చలేమీ ఉండవని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పిందని కెసిఆర్ అంటున్నారట.
బొత్స కూడా తనకు ఫోన్ చేసి, అయిపోయిందని, తెలంగాణ వస్తుందని చెప్పాడని వ్యాఖ్యానిస్తున్నారట. ఇప్పుడు మనం తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి.. ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలి.. సరిహద్దుల ఖరారు వంటి వాటిపై దృష్టి పెట్టాలని తనను కలిసిన వారికి సూచిస్తున్నారట. తెలంగాణ ఇస్తామంటే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఎప్పుడో చెప్పానని, 5న ఢిల్లీకి వెళ్తున్న తాను.. కాంగ్రెస్ పెద్దలు ఉండమంటే మరికొన్ని రోజులు అక్కడే అందుబాటులో ఉండాల్సి వస్తుందని, మీరు కూడా ఇక్కడ సంబరాలకు సిద్ధంగా ఉండాలని, వస్తే ఢిల్లీకి రావాలని కెసిఆర్ సూచిస్తున్నారట.
ఈసారి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి రాహుల్ గాంధీని కలిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాహుల్ను కలిసి ఆయన అనుమానాలు నివృత్తి చేసేందుకే కెసిఆర్ అతనిని కలవనున్నారని అంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రం.. ప్రత్యేక మండలిని ప్రకటిస్తే ఎలా అనే అంశంపై కూడా తెరాస వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మండలి ఇచ్చినా తమకే మంచిదని, ఒకసారి కొట్లాడితే 2009, డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని, రెండోసారి కొట్లాడినందుకు మండలి ఇస్తే.. మూడోసారి గట్టిగా కొట్లాడితే రాష్ట్రమే వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారట.
తాజాగా కెసిఆర్ కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానం మేరకే ఢిల్లీకి వెళ్తున్నారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఐకాస ముఖ్యులు మాత్రం ఒకవైపు సెప్టెంబర్ 30న తాము తలపెట్టిన తెలంగాణ మార్చ్ విజయవంతానికి కసరత్తు చేస్తూనే, మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నారు. కెసిఆర్ను ఢిల్లీలో సెప్టెంబర్ రెండోవారంలో ఒకటి, రెండు రోజులు అందుబాటులో ఉండాలని ఏఐసిసిలోని ఉన్నతస్థాయి వర్గాలు కోరినట్లు తెలుస్తోందని, దీనికి తాము సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించడమే కారణమని ఐకాస నేతలు చెబుతున్నారట.