నేతలు మళ్లీ యుటర్న్: కాంగ్రెసును వీడని వైయస్ నీడ
అయితే మెజార్టీ నేతల అభిప్రాయం నేపథ్యంలో వైయస్ను వదిలించుకునేందుకే కాంగ్రెసు సిద్ధపడింది. అయితే ఆ తర్జన భర్జన పూర్తిగా వీడక ముందే సెప్టెంబర్ 2న వైయస్ మూడో వర్ధంతి సందర్భంగా వైయస్ పైన కాంగ్రెసు పార్టీ అభిప్రాయం బయటపడింది. వైయస్ను జగన్కు వదిలేయాలనుకున్న కాంగ్రెసు తిరిగి ఈ విషయమై యూ-టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ నిన్న మాట్లాడుతూ... వైయస్ తమ పార్టీ నేత, అని ఇతను తన చివరి శ్వాస వరకు కాంగ్రెసు కోసమే పని చేశారని, 2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నదే అతని ప్రధాన లక్ష్యమని, ఆయన ఆశయసాధన కోసం మేం కృషి చేస్తామని చెప్పారు.
వైయస్ మా నేత అని, ఆయన దారిలోనే నడుస్తామన్నారు. వైయస్ ఎపి నుండి ముఖ్యమైన నేత అని, ఆయనను తమ పార్టీ ఎప్పటికీ మర్చిపోదని వీరప్ప మొయిలీ అన్నారు. వైయస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు. మంత్రి దానం నాగేందర్ మరో అడుగు ముందుకేసి.. ఆరోగ్యశ్రీ హెల్త్ బిల్డింగ్ పైన, 108 ఎమర్జెన్సీ సర్వీసుల పైన వైయస్ పేరును తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. తొలగించిన వాటిని మళ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు.
వైయస్ సేవలు మరువలేనివని, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదని, తాము తప్పకుండా అతనిని ఫాలో అవుతామని దానం చెప్పారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా నల్గొండ జిల్లాలో ఘాటుగానే స్పందించారు. వైయస్ను తక్కువ చేయడం మంచిది కాదని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. వైయస్ పైన కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైయస్ తనను చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేని, మంత్రిని చేశారన్నారు. వైయస్ పథకాలకు పేర్లు మారిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
వైయస్ అంశంలో కాంగ్రెసు యు టర్న్ తీసుకోవడంపై వైయస్సార్ కాంగ్రెసులోనూ జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు చంచల్గూడ జైలులో ఉన్న వైయస్ జగన్ ఆదివారం ఎప్పటిలాగే తన బ్యారెక్లో ప్రార్థనలు చేశారు. అతనిని కలిసేందుకు జైలు అధికారులు కుటుంబ సభ్యులు సహా ఎవరికీ అనుమతించలేదని తెలుస్తోంది.